హృదయవిదారకం: రోజుల శిశువు కాళ్లు, చేతులు విరిచేశారు
కర్నూలు: రోజుల పసికందును ఎంతో అపురూపంగా చూసుకోవాల్సి ఉండగా.. కొందరు దుండగులు శిశువు కాళ్లు, చేతులు విరిచి ప్రభుత్వ ఆస్పత్రి ముందు పడేసి పారిపోయారు. ఈ హృదయవిదారక ఘటన కర్నూలులో చోటు చేసుకుంది.
అభంశుభం తెలియని ఆ చిన్నారి బాధను తట్టుకోలేక విలవిల్లాడుతూ కేకలు పెట్టింది. ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో బాధతో తల్లడిల్లుతున్న ఆ ఆడ శిశువును గుర్తించిన సిబ్బంది వెంటనే వైద్యుల వద్దకు తీసుకువెళ్లి చికిత్స చేయించారు.
శిశువు దొరికిన విషయాన్ని ఆసపత్రి సిబ్బంది ఐసీడీఎస్ అధికారులకు తెలియజేశారు. శిశుగృహ మేనేజర్ మెహతాజ్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి పసిబిడ్డను పరిశీలించారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఎన్ఐసీయూలో చేర్పించారు.
శిశువు చేతులు, కాళ్లను కర్కశంగా విరిచినట్లు వైద్యులు గుర్తించారు. బాలల సంక్షేమ కమిటీ ఉత్తర్వుల మేరకు శిశువు తమ ఆధీనంలో ఉన్నట్లు ఐసీడీఎస్ అధికారులు తెలిపారు.
కాకినాడ ఆస్పత్రిలో శిశువు అపహరణ
తూర్పుగోదావరి: కాకినాడ జీజీహెచ్ ఆస్పత్రిలో రెండు రోజుల పసికందును గుర్తుతెలియని ఓ మహిళ అపహరించుకుపోయింది. సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా ఆ మహిళను పోలీసులు గుర్తించారు. ఆమెను జగ్గంపేటకు చెందిన మహిళగా అనుమానిస్తున్నారు. పసికందు కనబడకుండా పోవడంతో ఆ చిన్నారి తల్లి తల్లడిల్లిపోతోంది. సిసి కెమెరా ఫుటేజీ ఆధారంగా మహిళ కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.