చంద్రబాబుకు థ్యాంక్స్ చెప్పిన టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. గురువారం నాడు 65,980 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 27,441 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 4.21 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 26 కంపార్టుమెంట్లు నిండిపోయాయి. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 14 నుంచి 18 గంటల సమయం పట్టింది. కంపార్ట్మెంట్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదాలు, పాలు, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.

కాగా- టీటీడీ అదనపు కార్యనిర్వహణాధికారిగా అపాయింట్ అయిన ఐఆర్ఎస్ అధికారి సీహెచ్ వెంకయ్య చౌదరి.. కొద్దిసేపటి కిందటే బాధ్యతలను స్వీకరించారు. అంతకుముందు ఆయన స్వామివారికి తలనీలాలను సమర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఉన్న రంగనాయకులవారి మండపంలో టీటీడీ అర్చకులకు ఆయనకు వేదాశీర్వచనాలు పలికారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. శేషవస్త్రాన్ని బహూకరించారు. శ్రీవారి ఫొటో, అగరబత్తులు, గో ఉత్పత్తులను అయనకు అందజేశారు. తిరుమల క్షేత్ర సాంప్రదాయాన్ని పాటిస్తూ శ్రీ భూ వరాహస్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా వెంకయ్య చౌదరి మాట్లాడారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో టీటీడీ అదనపు ఈవోగా బాధ్యతలు స్వీకరించడాన్ని తన అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. టీటీడీ అదనపు ఈవోగా తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రపంచం నలుమూలల నుండి శ్రీవారి దర్శనార్థం ప్రతిరోజు వేలాదిగా విచ్చేస్తున్న భక్తులకు మరింత సౌకర్యవంతం, స్నేహపూరకం, పారదర్శకంగా సేవలను అందిస్తామని వెంకయ్య చౌదరి హామీ ఇచ్చారు. టీటీడీలోని అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.
భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై అభిప్రాయ సేకరణ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన శ్రీవారి ఆలయ సంప్రదాయాన్ని కాపాడేందుకు, భక్తులకు అత్యంత అంకితభావంతో సేవలందించేందుకు తగిన శక్తిని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications