నిజంగా బాబుకి మోడీ భయపడుతున్నారా?: లీకుల్లో నిజమెంత..
Recommended Video
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఇప్పుడో పెద్ద లీకుల గోల. ఏ లీకులో ఎంత నిజముందో తెలియదు కానీ చంద్రబాబు అనుకూల వర్గం మాత్రం వీటితోనే ఆయన్ను గట్టెక్కించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
సాక్షాత్తు మోడీనే చంద్రబాబుతో కాళ్లబేరానికి వస్తున్నారన్న తరహాలో ప్రచారాన్ని ఊదరగొడుతోంది. అయితే ఏపీ సీఎంతో దగ్గర అంత సాగిలపడాల్సిన అవసరం నిజంగా మోడీకి ఉందా? అని ప్రశ్నిస్తే.. అన్నీ సమాధానాలు దొరుకుతాయి.
ఏంటీ ప్రచారం?:
'బాబును ప్రసన్నం చేసుకోండి..', 'ఆయనతో పెట్టుకోవద్దు..' అంటూ మోడీ క్యాంప్ నుంచి ఇటీవల రాష్ట్ర బీజేపీకి ఆదేశాలు జారీ అయినట్టుగా కొంత ప్రచారం జరిగింది. ఇవి నిజంగా మోడీ ఆదేశాలా?.. లేక కల్పిత ప్రచారాలా? అన్నది వేరే సంగతి. కానీ మోడీకి చంద్రబాబును దేబిరించేంత అవసరం నిజంగా ఉందా? అన్నదే పాయింట్.
ఎందుకు వణికిపోతున్నట్టు?:
చంద్రబాబు గనుక నిజంగా తెగదెంపులకు పోతే బీజేపీకి పెద్దగా పోయేదేమి లేదు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమ పార్టీ అద్భుతాలు సృష్టించేస్తుందన్న భ్రమలో మోడీ ఏమి లేరు. పోనీ.. కేంద్రంలో ఏమైనా నష్టమే అంటే అదీ లేదు. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఇంకో కూటమి ఏర్పాటు చేసి ఎన్డీయేకి గండి కొట్టేంత సీన్ ఏమి కనిపించడం లేదు. అలాంటప్పుడు మోడీ ఇంతలా చంద్రబాబు అంటే ఎందుకు వణికిపోతారు?
బాబును ప్రసన్నం చేసుకోండి: వారికి మోడీ ఆదేశం? దోస్తీ.. బీజేపీకి మరో పెద్ద భయం
మోడీ భయపడిపోతున్నట్టుగా చూపిస్తే..:
హోదా, ప్యాకేజీల విషయంలో కేంద్రంతో టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై జనంలో భిన్నాభిప్రాయాలు మొదలయ్యాయి. ముఖ్యంగా టీడీపీపై ఎక్కడ వ్యతిరేకత పెరిగిపోతుందోనన్న ఆందోళన ఆ పార్టీలో మొదలైంది.
ఇదిలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పెద్ద దెబ్బే పడవచ్చునన్న అంచనాలు కూడా ఉన్నాయి. కాబట్టి.. చంద్రబాబు అంటే మోడీ భయపోతున్నట్టుగా చూపిస్తే.. ప్రజల్లోకి వేరే విధమైన సంకేతాలు వెళ్తాయని టీడీపీ శిబిరం భావిస్తున్నట్టుంది.
టీడీపీ సంతృప్తి కోసమే?:
ఏడాది కాలంగా చంద్రబాబు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఒక్క అపాయింట్ మెంట్ కూడా ఇవ్వని మోడీ.. ఇప్పుడు మాత్రం ఉన్నపలంగా 'బాబును ప్రసన్నం చేసుకోండి' అని అంటారా?.. ఇలాంటి ప్రచారాల ద్వారా టీడీపీ సంతృప్తి పొందడమే తప్పించి మరొకటి లేదనే వాదన బలంగా వినిపిస్తోంది.