కేసీఆర్, జగన్ కొత్త స్ట్రాటజీ- ఆపరేషన్ షురూ..!!
ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. ఇద్దరూ దాదాపుగా ఒకే బాటలో పయనిస్తున్నారు. ఇద్దరూ ఒకే రక మైన వ్యూహాలు అమలు చేస్తున్నారు. ఇద్దరి లక్ష్యం ఒక్కటే. ఆ ఇద్దరే ఏపీ - తెలంగాణ మాజీ సీఎం లు జగన్ - కేసీఆర్. ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ ఫాం హౌస్.. జగన్ బెంగళూరు కు పరిమితి అయ్యారు. ఇప్పుడు ఇద్దరూ తిరిగి యాక్టివ్ అయ్యారు. ఒకే స్ట్రాటజీ అమలు చేస్తున్నారు. టార్గెట్ ఫిక్స్ అయింది. ఈ ఇద్దరి కొత్త వ్యూహాలు ఇప్పుడు రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.
ఇద్దరూ ఒకే అజెండా
ఇద్దరు మాజీ సీఎంలు కేసీఆర్ - జగన్ ఇద్దరూ దాదాపు ఒకే సమయంలో బయటకు వచ్చారు. 2023 ఎన్నికల్లో ఓటమి తరువాత కేసీఆర్ ఫాం హౌస్ లోనే ఉంటున్నారు. ఏడు నెలల తరువాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం గురించి వ్యాఖ్యలు చేసారు. తిరిగి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేసారు. తాను అంతా గంభీరంగా చూస్తున్నానంటూ పార్టీ నేతలకు చెప్పుకొచ్చారు. ఇక జనంలోకి వెల్లేందుకు కేసీఆర్ ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభ ద్వారా తన కార్యాచరణ ప్రకటించనున్నారు.

అసెంబ్లీకి దూరంగా
ఏపీలో జగన్ ఇదే సమయంలో బయటకు వచ్చారు. మిర్చి రైతుల పరామర్శ ద్వారా ఎన్నికల్లో ఓటమి తరువాత తొలి పర్యటన చేసారు. ప్రతిపక్షంలో ఉన్న ఏకైక పార్టీ నేతగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదనే కారణంగా అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. ఈ సారి బడ్జెట్ సమావేశాలకు హాజరయ్యే అవకాశం లేదు. అటు కేసీఆర్ కు హోదా ఉన్నా.. అసెంబ్లీకి వెళ్లటం లేదు. ఉగాది నుంచి జగన్ పార్టీ కేడర్ - ప్రజలతో మమేకం అయ్యేలా కొత్త కార్యాచరణ ఖరారు చేస్తున్నారు. అనంతపురం నుంచి జిల్లాల పర్యటనలను ప్రారంభించాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వం ఈ నెల 28న ప్రవేశ పెట్టే బడ్జెట్ ఏపీ రాజకీయాల్లో కీలకం కానుంది.
ఇద్దరి టార్గెట్
ఇప్పుడు కేసీఆర్ - జగన్ ఇద్దరి లక్ష్యం తిరిగి అధికారం దక్కించుకోవటమే. ఇద్దరూ తమ రాష్ట్రాల్లో ప్రభుత్వాల పైన వ్యతిరేకత గురించి ప్రస్తావన చేస్తున్నారు. ముఖ్యమంత్రులుగా ఉన్న సమయం లో ఇద్దరూ ఐక్యంగా ఉన్నారు. కేసీఆర్ తో ఇప్పటికీ జగన్ కు సత్సంబంధాలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు టీడీపీని తిరిగి తెలంగాణలో బలోపేతం చేసే ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది.
బీజేపీ నాయకత్వం తెలుగు రాష్ట్రాల్లో చేసే రాజకీయం ఈ ఇద్దరి పైనా ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో, ఢిల్లీ సమీకరణాలను గమనిస్తూ.. తమ రాష్ట్రాల్లో మారుతున్న లెక్కలకు అనుగుణంగా ఈ ఇద్దరు మాజీ సీఎంలు.. కొత్త స్ట్రాటజీలతో తమ ఇద్దరి కామన్ టార్గెట్ అయిన అధికారం కోసం రానున్న రోజుల్లో ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తిగా మారుతోంది.












Click it and Unblock the Notifications