వైఎస్ జగన్ కొంప ముంచిన ఆ ఒక్క నిర్ణయం?
ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ఫలితాలు వెల్లడయ్యే సమయానికి 12 నుంచి 14 సీట్ల మధ్యలో ఉంది. గత ఎన్నికల సమయానికి 151 సీట్లతో తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించిన వైసీపీ ఐదు సంవత్సరాలకే ఘోర పరాభవాన్ని మూటకట్టుకోవడానికి అనేక కారణాలు దోహదపడ్డప్పటికీ ప్రధానంగా ఒక్క నిర్ణయం మాత్రం వైఎస్ జగన్ కొంప ముంచేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్కటీ ఏదో కాదు.. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుణ్ని అరెస్ట్ చేయించడం.
53 రోజులు జైలులో
స్కిల్ స్కామ్ కేసులో అవినీతికి పాల్పడ్డారంటూ చంద్రబాబునాయుణ్ని అరెస్ట్ చేయడమే కాకుండా వ్యవస్థలను మానేజ్ చేసి 53 రోజులపాటు రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఉంచారు. లేని కేసులో చంద్రబాబు పాత్ర ఉన్నట్లు సృష్టించడమే కాకుండా కావాలనే అన్నిరోజులు జైలులో ఉంచినట్లు రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టమైంది. తమిళనాడులో ఈ తరహా కక్షసాధింపు రాజకీయాలను చూశారుకానీ మన రాష్ట్రంలో ఇలాంటివి వద్దనుకున్నారు. కానీ అటువంటి కక్ష రాజకీయాలకు ఏపీ ఐదు సంవత్సరాల నుంచి వేదికగా మారింది.

ఆంధ్రుడి తెలివైన నిర్ణయం
ఈ తరహా పోకడలను వద్దనుకున్న ఆంధ్రులు తెలివిగా నిర్ణయం తీసుకున్నారు. అధికార పక్షానికి అనుకూలంగా ఓటు వేసినవారు తాము ఓటు వేశామని చెబుతారు. కానీ ప్రతిపక్షానికి ఓటు వేసిన ఆంధ్రులు ఆ విషయాన్ని గుంభనంగా ఉంచారు. ఏ పార్టీవారు అడిగినా మీకే వేశానని చెప్పారుకానీ తాను నిజంగా పోలింగ్ కేంద్రంలో ఏ గుర్తుపై బటన్ నొక్కాననేది మాత్రం తన మనసులోనే ఉంచుకున్నారు. కక్షలు, కార్పణ్యాలు, చంద్రబాబు అరెస్ట్ తోపాటు ఇతర ప్రతిపక్ష నేతలపై కేసులు, సీఐడీతో అర్థరాత్రివేళ తలుపులు బలవంతంగా తెరిపించి అరెస్ట్ లు చేయించడం, సామాజిక మాధ్యమాల్లో సరదాగా పెట్టుకునే పోస్టింగ్స్ కూడా షేర్ చేయకుండా కట్టడి చేసేందుకు అరెస్టులు చేయించడంలాంటివన్నీ కూడా జగన్ ఓటమికి ప్రత్యక్షంగా కారణాలయ్యాయి. ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ తమకు అధికారాన్ని దూరం చేసిందని వైసీపీ నాయకులు కూడా ఒప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications