జగన్ డబుల్ గేమ్, బొత్స ఆస్తులకు రక్షణ లేదా: విహెచ్
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ ఆడుతున్నారని కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు వి హనుమంత రావు ఆదివారం మండిపడ్డారు. సమైక్యం ముసుగులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వారే గూండాగిరి చేస్తున్నారని ఆరోపించారు.
ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆస్తులకే రక్షణ లేకుంటే ఎలాగని ప్రశ్నించారు. ఎపిఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు నియంతలా మాట్లాడుతున్నారని, ప్రభుత్వం ఆయన విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు.
ప్రభుత్వాన్ని ఆయనే నడుపుతున్నారా అని ఎధ్దేవా చేశారు. బొత్స, అమలాపురం ఎంపి హర్ష కుమార్ ఇళ్ల పైన దాడులు సరికాదన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవిస్తానని చెప్పిన వైయస్ జగన్ ఇప్పుడు సమైక్యమంటూ ఆమరణ దీక్ష చేయడమేమిటన్నారు.
ముఖ్యమంత్రితో డిజిపి భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో డిజిపి ప్రసాద రావు ఆదివారం భేటీ అయ్యారు. విజయనగరం పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు.