ఏబీ వెంకటేశ్వరరావుకు జగన్ మరో ఝలక్- తీవ్ర అభియోగాలు- లాబీయింగ్ చేస్తే చర్యలు
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిఘా పరికరాల కొనుగోలు కేసులో మాజీ ఇంటిలిజెన్స్ ఛీఫ్ ఏబీ వెంకటేశ్వరావుపై ప్రభుత్వం తీవ్ర చర్యలకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం తరఫున నిఘా పరికరాలు కొనుగోలు చేసి విపక్ష నేతలపై నిఘాకు వాటిని వాడారంటూ ఆయనపై వచ్చిన ఆరోపణల ఆధారంగా తాజాగా ప్రభుత్వం అభియోగాలు నమోదు చేసింది. దీంతో ఆయన చిక్కుల్లో పడినట్లే కనిపిస్తున్నారు. ఆయనపై అభియోగాలు నమోదు చేయకుండా నేరుగా చర్యలు తీసుకోవడాన్ని కోర్టులు తప్పుపట్టిన నేపథ్యంలో జగన్ సర్కారు తాజా నిర్ణయం సంచలనం రేపుతోంది.
Recommended Video


ఏబీని వీడని జగన్ సర్కారు...
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిలిజెన్స్ ఛీఫ్గా వ్యవహరించడమే కాకుండా అప్పటి సీఎం చంద్రబాబుకు ఆప్తుడిగా పేరు తెచ్చుకున్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు ఇప్పట్లో వదిలేలా లేదు. చంద్రబాబు హయాంలో ఆయన కొనుగోలు చేసిన భద్రతా పరికరాల వ్యవహారాన్ని తవ్వితీసిన జగన్ ప్రభుత్వం... ఆయన్ను సస్పెండ్ చేయడమే కాకుండా పలు చర్యలకు ఉపక్రమించింది. అయితే ఏపీ ప్రభుత్వం చర్యలను న్యాయస్ధానాల్లో సవాలు చేసిన ఏబీకి ఓ మోస్తరు ఊరటమాత్రమే దక్కింది. ఏబీపై అభియోగాలు నమోదు చేయకుండా నేరుగా చర్యలేంటని న్యాయస్ధానాలు అక్షింతలు వేసే సరికి ప్రభుత్వం రూటు మార్చింది.

ఏబీపై అభియోగాల నమోదు...
గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన నిఘా పరికరాల కొనుగోళ్ల వ్యవహారంలో ఏబీ వెంకటేశ్వరరావుపై సర్కారు తాజాగా అభియోగాలు నమోదు చేసింది. వీటిలో ఇజ్రాయెల్కు చెందిన ఆర్టీ ఇన్ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ ఇండియా లిమిటెడ్కు కాంట్రాక్టు దక్కేలా ఏబీ ఒత్తిడి తీసుకురావడం, సదరు పరికరాల కొనుగోళ్లలో నాణ్యత, సమర్ధత, గ్యారంటీ వంటి విషయాల్లో రాజీపడి తన కుమారుడు చేతన్ సాయికృష్ణకు కాంట్రాక్టు ఇప్పించడం, ఇజ్రాయెల్ సంస్ధకు భారత్లో ప్రతినిధిగా ఉన్న తన కుమారుడి సంస్ధ ఆకాశం అడ్వాన్సెడ్ సిస్టమ్స్ లిమిడెట్ వివరాలను ప్రభుత్వానికి ఇవ్వకపోవడం, బిడ్డింగ్లోనూ అనుభవంలేని కాంపిటీటివ్ సంస్ధలను పెట్టి తన కుమారుడి సంస్ధకు కాంట్రాక్టు ఇప్పించుకోవడం, అందులోనూ ప్రభుత్వ మార్గదర్శకాలు పాటించకపోవడం వంటి అభియోగాలు ఉన్నాయి.

లాబీయింగ్ చేస్తే క్రమశిక్షణ చర్యలకు హెచ్చరిక
ప్రభుత్వం నమోదు చేసిన అభియోగాలపై ఏబీ వెంకటేశ్వరరావు 15 రోజుల్లో లిఖితపూర్వకంగా కానీ, నేరుగా హాజరై కానీ వివరణ ఇవ్వాలని కోరారు. అంతే కాక ఈ వివరణ కూడా తనపై నమోదైన అభియోగాలకే పరిమితం కావాలని షరతు పెట్టారు. నిర్ణీత గడువులోగా వివరణ ఇవ్వకపోతే అభియోగాలు నిజమని నిర్ధారించి తదుపరి చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం తెలిపింది. తనపై నమోదైన అభియోగాలపై దర్యాప్తు అధికారులపై రాజకీయ నేతలతో కానీ ఇతర పెద్దలతో కానీ ఎలాంటి ఒత్తిళ్లు తీసుకురాకూడదని సూచించారు. అలా చేస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో ఈ కేసులో ఏబీని పూర్తి స్ధాయిలో టార్గెట్ చేసినట్లు అర్ధమవుతోంది. దీంతో ఇప్పుడు ఏబీపై నమోదైన అభియోగాలకు ఆయన ఏం వివరణ ఇవ్వబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.












Click it and Unblock the Notifications