పవన్, ఈనాడు, జ్యోతికి జగన్ సర్కార్ భారీ షాక్-ప్రాసిక్యూషన్ కు అనుమతి...
ఏపీలో వాలంటీర్లపై నిరాధార ఆరోపణలు చేసిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఆ వ్యాఖ్యల్ని ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై ప్రాసిక్యూషన్ కు అనుమతిస్తూ జగన్ సర్కార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ జీవో జారీ చేసింది. ఇందులో వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యలు, వాటిని ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు ఏయే హెడ్డింగ్స్ తో ప్రచురించాయో వివరాలు కూడా ఇచ్చారు.
ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పవన్ కళ్యాణ్ గ్రామ, వార్డు వాలంటీర్లు, వాలంటీర్ల వ్యవస్ధ, ఏపీ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేశారని పేర్కొన్నారు. ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఏపీలో 29 వేల మంది మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లే కారణమని పవన్ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. ఒంటరి మహిళల నుంచి సంక్షేమ పథకాల కోసమంటూ డేటా తీసుకుని వాటిని అసాంఘిక శక్తుల చేతుల్లో పెడుతున్నారని, దీంతో మహిళల అక్రమ రవాణా జరుగుతోందని పవన్ చెప్పినట్లు పేర్కొన్నారు.

వాలంటీర్ల వ్యవస్ధను తీసుకొచ్చిన ప్రభుత్వం మహిళల ఇబ్బందుల్ని ఆసరాగా చేసుకుని వారి అక్రమ రవాణాకు పాల్పడుతోందని పవన్ చెప్పినట్లు తెలిపారు. వాలంటీర్లు ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్న మహిళల్ని టార్గెట్ చేసి వారిని అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నారని చెప్పారన్నారు. ఇందులో 14 వేల మంది మహిళలనే పోలీసులు గుర్తించారని, మరో 16 వేల మందిని గుర్తించాల్సి ఉందని కూడా చెప్పారన్నారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా విస్తృతంగా ప్రచారం అయ్యారని పేర్కొన్నారు.
మహాత్మగాంధీ సిద్ధాంతమైన గ్రామ స్వరాజ్యం దిశగా అడుగులేస్తున్న ఏపీ ప్రభుత్వం ఇందులో భాగంగా గ్రామ, వాలంటీర్ల వాలంటీర్ల వ్యవస్ధను తీసుకొచ్చిందని, దీంతో పేదలకు సంక్షేమ పథకాలు పేదలకు ఎలాంటి అవినీతి లేకుండా ఇళ్లవద్దే అందుతున్నాయని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్ధను పేదలతో పాటు ఎన్నో రాష్ట్రాలు మెచ్చుకుని రోల్ మోడల్ గా తీసుకుంటున్నాయన్నారు. ఇలాంటి తరుణంలో వాలంటీర్ల వ్యవస్ధపై పవన్ చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవస్ధకు మచ్చతెచ్చేలా, వారి పరువుతీసేలా ఉన్నాయన్నారు. అలాగే ఒంటరి మహిళల్లో భయాందోళనలు కలిగించేలా ఉన్నాయన్నారు.
కాబట్టి ప్రభుత్వం 1973 నాటి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ లోని సెక్షన్ 199(4)బీ ప్రకారం పబ్లిక్ ప్రాసిక్యూటర్ కు తగిన కోర్టులో పవన్ కళ్యాణ్ తో పాటు ఆయన వ్యాఖ్యల్ని ప్రచురించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలపై పరువునష్టం దావా కోరుతూ పిటిషన్ దాఖలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఈ ఉత్తర్వుల్ని జారీ చేశారు.












Click it and Unblock the Notifications