ఉద్యోగులకు జగన్ మరో గుడ్ న్యూస్- త్వరలో ఎలక్ట్రిక్ బైక్ లు- వివరాలివే..
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రస్తుతం రాష్ట్రంలో పెరుగుతున్న వాహనాల కాలుష్యాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఇకపై ఎలక్ట్రిక్ వాహనాలు అందించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సంస్ధ నెడ్ క్యాప్ కీలక ఒప్పందం కుదుర్చుకుంది.
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ బైక్ లు సరఫరా చేసేందుకు వీలుగా 17 తయారీ సంస్ధలతో నెడ్ క్యాప్ ఒప్పందం చేసుకుంది. ఇందులో ఓలా, అథర్, బిగాస్, కైనెటిక్, టీవీఎస్, హీరో వంటి సంస్ధలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమకు నచ్చిన బైక్ లు ఎంచుకుని వాటిని నెడ్ క్యాప్, బ్యాంక్ రుణాల ద్వారా పొందేందుకు వీలు కలగనుంది. ఈ వాహనాలు కావాలనుకునే ఉద్యోగుల కోసం నెడ్ క్యాప్ ప్రత్యేక యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చింది.
నెడ్ క్యాప్ యాప్ లో ఉద్యోగులు ఎలక్ట్రిక్ బైక్ ల కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి కావాల్సిన రుణాలు అందించేందుకు బ్యాంకుల్ని కూడా అందుబాటులో ఉంచారు. ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడాతో పాటు పలు బ్యాంకులు ఈ రుణాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. విజయవాడలో ఇలా ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహన రుణాలు ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రత్యేక శాఖను కూడా అందుబాటులోకి తెస్తోంది. ఏడాదిలో లక్ష ఎలక్ట్రిక్ వాహనాల్ని ఉద్యోగులకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.