సుప్రీంలో చెల్లదు: పోలవరం ఆర్డినెన్స్ బిల్లుపై జైపాల్
న్యూఢిల్లీ: తనకు తెలిసినంత వరకు పోలవరం ఆర్డినెన్స్ బిల్లు సుప్రీంకోర్టులో నిలువదని మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెసు సీనియర్ నేత ఎస్ జైపాల్ రెడ్డి అన్నారు. రాజ్యసభలో ప్రతిపాదించడానికి ముందైనా బిల్లుపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొందరపడిందో తెలియడం లేదని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3, 4 ప్రకారం తెలంగాణ బిల్లు ప్రక్రియ ముగిసిందని ఆయన చెప్పారు. పోలవరం ముంపు ప్రాంతాలను గ్రామం యూనిట్గా విభజన బిల్లులో చేర్చామని, ఇప్పుడు మండలాలను యూనిట్గా పరిగణిస్తూ ఎన్డిఎ ప్రభుత్వం బిల్లు తెచ్చిందని, అందువల్ల అది రాజ్యంగ విరుద్ధమని, అప్రజాస్వామికమని ఆయన అన్నారు. తమ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులోనే పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చామని, ఇప్పుడు అదనంగా కొన్ని గ్రామాలను చేరుస్తూ బిల్లు తెచ్చారని ఆయన చెప్పారు.
ముంపు గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించడానికి ఇతర గ్రామాలను వాడుకోవాలని చూస్తున్నారని, అయితే, తమకు ప్రాజెక్టు కింద సాగు భూమి ఇవ్వాలని ముంపు గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు. ఆ గ్రామాలను ఆంధ్రప్రదేశ్లో చేర్చినా ప్రాజెక్టు పూర్తి కావడానికి తెలంగాణ ప్రభుత్వ సహకారం అవసరమని ఆయన అన్నారు. అధికార పరిధిలో లేనిదానిపై ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిందని ఆయన అన్నారు. దాన్ని తేవాలంటే రాజ్యాంగంలోని 3,4 ఆర్టికల్స్ కింద తేవాలని ఆయన అన్నారు.
బిల్లును లోకసభలో ఆమోదించే విషయంలో కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరించిందని, తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించకుండా బిల్లు ఎలా తెస్తారని ఆయన అన్నారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో చేర్చడాన్ని తాను మంత్రివర్గంలో వ్యతిరేకించానని, అయినా అది ఆమోదం పొందిందని, అయితే తమ ప్రభుత్వం దాన్ని రాష్ట్రపతికి పంపించలేదని వివరించారు.
నిరంకుశంగా, ఏపక్షంగా సవరణలను రుద్దడం వల్ల రెండు రాష్ట్రాల ప్రజల మధ్య, ప్రభుత్వాల మధ్య స్నేహభావం మరింతగా బలహీనపడుతుందని ఆయన అన్నారు.