రాజధాని సహా చాలా చెప్పాం, ఏపీకి ఇంతేనా!: జైరాం
న్యూఢిల్లీ: బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన కేటాయింపుల విషయమై కేంద్ర ప్రభుత్వం పైన మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఆదివారం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్డీయే ప్రభుత్వ తొలి బడ్జెట్పై జైరాం పెదవి విరిచారు. జైరాం రమేష్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు తయారీలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది స్వల్పమే అన్నారు.
ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధాని నిర్మించేందుకు నిధులెక్కడ కేటాయించారని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2013లో తాము కొత్త రాజధానిని నిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తామని పేర్కొన్నామన్నారు. కానీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక్క పైసా కేటాయించలేదన్నారు. కొత్త విద్యాసంస్థల ఏర్పాటుకు చెప్పుకోదగిన కేటాయింపులు చేయలేదన్నారు.

2014-15 సంవత్సరానికి ఈ బడ్జెట్లో ఐఐఎం, ఐఐటీ, ఎన్ఐటీ, భారత శాస్త్ర విద్యాపరిశోధన సంస్థ (ఐఐఎస్ఇఆర్), ఐఐఐటీ (త్రిబుల్ ఐటీ), గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేవలం రూ.కోటి చొప్పున మాత్రమే కేటాయించారన్నారు.చివరకు ఎయిమ్స్ వంటి సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకూ వేరుగా నిధులు కేటాయించలేదని, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్తో కలిపి కేవలం రూ.500 కోట్లే కేటాయించారని ఆయన విమర్శించారు.
ఎంత చేయగలనో అంతే: అరుణ్ జైట్లీ
ఎన్డీయే తొలి బడ్జెట్పై విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాను చేయగలిగినదంతా చేశానని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ వేరుగా అన్నారు. బడ్జెట్తోనే తమ ప్రభుత్వ ప్రయాణం మొదలైందని గుర్తుచేసిన ఆయన ఇదే ముగింపు కాదన్నారు. తమ ప్రయాణానికి ఇది (బడ్జెట్) ఆరంభమని, ముగింపు కాదన్నారు. ఇప్పుడు నేను ఎంత చేయగలనో అంతా చేశానని, అయినా అన్ని నిర్ణయాలు తొలి రోజే తీసుకోలేము కదా అన్నారు.












Click it and Unblock the Notifications