మీ బతుక్కి శాఖలమీద అవగాహన ఉండదు: నాగబాబు
రాష్ట్ర అభివృద్ధి గురించికానీ, ఇతర విషయాల గురించి కానీ ఆలోచించకుండా పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా సినీపరిశ్రమపై పడతారేంటి? అని అగ్ర కథానాయకుడు చిరంజీవి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రులు, ఇతర నాయకులు విలేకరుల సమావేశాలు ఏర్పాటుచేసి చిరంజీవి వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. అయితే వీరు మాట్లాడిన తర్వాత చిరంజీవికానీ, పవన్ కల్యాణ్ కానీ స్పందించలేదు. తాజాగా వారి సోదరుడు, జనసేన నాయకుడు నాగబాబు స్పందించారు. ట్విటర్ లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.
శ్రమను పెట్టుబడిగా పెట్టి, ప్రభుత్వానికి పన్నును అణాపైసలతో సహా కట్టి, వినోదాన్ని పంచిపెడుతోందని, 24 క్రాఫ్ట్ లకు అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ అన్నారు. నిజం మాట్లాడిన వ్యక్తి మీద ఆంధ్రా మంత్రులు విషం కక్కుతున్నారని, ఆయనతో ఫొటో దిగడం కోసం పడిగాపులు కాసినాళ్లంతా ఇప్పుడు ఆయనమీద కారుకూతలు కూస్తున్నారన్నారు.

ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే అది మీ ముఖం మీదే పడుతుందని, మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు.. అభివృద్ధి అనేపదానికి అర్థం తెలీదు.. బటన్ నొక్కి కోట్లల్లో ముంచి వేలమందికి ఉచితాలు పంచిపెట్టడమే అభివృద్ధి అనుకుంటున్నారా? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగలలేదనుకుంటున్నారా? మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మాటలు వింటుంటే అర్థమవుతోందన్నారు. ఈ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకు ఎండ్ కార్డ్ దగ్గరలోనే ఉందన్నారు. నోట్: కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుంది.. ఆరోగ్యాలు జాగ్రత్త అంటూ ట్విటర్ వేదికగా నాగబాబు వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications