'ఏయ్ ఆ సంగతి చూడవోయ్'.!. అంబటికి నాగబాబు కౌంటర్
కథానాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యాఖ్యాతగా ఉన్న అన్ స్టాపబుల్ షో కార్యక్రమానికి జనసేనాని పవన్ కల్యాణ్ వెళ్లారు. సినిమా రంగానికి సంబంధించినంతవరకు పవన్ కల్యాణ్, బాలకృష్ణ అభిమానుల్లో ఈ షో అంచనాలు పెంచేస్తోంది. మరోవైపు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. బాలకృష్ణ షోకు పవన్ వెళ్లడాన్ని వైఎస్సార్ సీపీ టార్గెట్ చేసింది.
మంత్రి అంబటి రాంబాబు, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా పవన్ పై వ్యాఖ్యలు చేశారు. 'అన్నయ్య షో కి డుమ్మా.. బాలయ్య షో కి జమ్మ.. రక్తసంబంధం కన్నా.. ప్యాకేజీ బంధమే గొప్పదా ?' అంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్కు సంబంధించి జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. అంబటి రాంబాబు జలవనరులశాఖ మంత్రిగా ముందు పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేసే సంగతి చూడాలని కామెంట్లు పెడుతున్నారు. జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు మంత్రి అంబటి రాంబాబుకు కౌంటర్ ఇచ్చారు. 'ఏయ్.. ముందెళ్ళి పోలవరం సంగతి చూడవోయ్ ... వె.ధ.వ సోది' అంటూ రిప్లై ఘాటుగా ఇచ్చారు.
బాలకృష్ణ వ్యాఖ్యాతగా చేస్తున్న అన్ స్టాపబుల్ షో రాజకీయ రంగానికి వేదికగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్ లో మొదటి ఎపిసోడ్ చంద్రబాబు, లోకేష్ తో చేయగా, ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి, ఆ తర్వాత కూడా సినీ, రాజకీయ రంగాల్లో ఉన్నవారు అతిథులుగా వచ్చారు. వాటన్నింటికన్నా మిన్నగా ఇప్పుడు పవన్ కల్యాణ్ రావడం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేనతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్లబోతుందని వార్తలు వస్తున్న తరుణంలోనే బాలయ్య షోకు పవన్ రావడంపై వైసీపీ నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.