లోకసభ టిడిపినేత జెసి, పార్లమెంటరీకి మురళీమోహన్?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ లోకసభ పక్షనేతగా జెసి దివాకర్ రెడ్డికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. టిడిపి పార్లమెంటరీ నేతగా సుజనా చౌదరి వ్యవహరించనున్నారు. త్వరలో ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్ను విస్తరించనున్నారు. ఈ విస్తరణలో సుజనాకు కేంద్రమంత్రి పదవి దక్కితే టిడిపి పార్లమెంటరీ నేతగా మురళీ మోహన్ వ్యవహరించే అవకాశముంది.
ఎస్వీలో టిడిఎల్పీ సమావేశం
చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో బుధవారం రాత్రి తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్షం సమావేశం కానుంది. 8.15కు టిడిఎల్పీ సమావేశమవుతుంది. టిడిపి ఎమ్మెల్యే కెఈ కృష్ణమూర్తి పార్టీ నాయకుడిగా చంద్రబాబు పేరును ప్రతిపాదిస్తారు. చంద్రబాబును ఎన్నుకుంటారు.
రాత్రి 8.50 నిమిషాలకు చంద్రబాబును ఎన్నుకున్నట్లు ప్రకటించనున్నారు. అనంతరం చంద్రబాబును అభినందిస్తారు. రాత్రి తొమ్మిదిన్నర గంటలకు చంద్రబాబు మీడియాతో మాట్లాడుతారు. పది గంటలకు పార్టీ నేతలకు విందు ఇస్తారు. అనంతరం తిరుమలలోనే బస చేస్తారు. గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాదుకు బయలుదేరారు.
వేదిక మార్పు
తిరుపతిలో జరుగనున్న టీడీఎల్పీ సమావేశ వేదికలో మార్పు జరిగింది. ఎస్వీయూ శ్రీనివాస ఆడిటోరియంలో జరగాల్సిన సమావేశాన్ని సెనేట్హాల్కు మార్చారు. కాగా, బాబు ప్రమాణ స్వీకారానికి ముందు తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం వేదపండితులు ఆశీస్సులు ఇవ్వనున్నారు.