టిక్కెట్ కొన్నాక: కొత్త పార్టీపై జెసి, స్థానికంపై సుప్రీం ఆర్డర్
రైలు ఆలస్యంగా వచ్చినట్లు కిరణ్ కూడా తన పార్టీని ఆలస్యంగా ప్రకటించారన్నారు. దీని ప్రభావం అంతగా ఉండదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలలో టిక్కెట్లు ఆశించి రాని వారు మాత్రమే కిరణ్ పార్టీలో చేరుతారన్నారు. రాష్ట్రం విడిపోయాక కిరణ్ పార్టీ పెట్టడంలో అర్థం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలిపోయిందని, ఇంకా ఏం మిగిలిందని కిరణ్ కొత్త పార్టీయో చెప్పాలన్నారు. ఇల్లు అలకగానే పండుగ కాదని, ఆ పార్టీ అనంతపురంలో రెండు సీట్లు గెలుచుకుంటుందా అని ప్రశ్నించారు. గ్రౌండ్ వర్కు లేకుండా ఊహాగానాలతో వెళ్తే మంచిది కాదన్నారు. సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ పని అయిపోయిందన్నారు.
జైరాంపై యనమల ఆగ్రహం
కేంద్ర మంత్రి జైరామ్ రమేష్ పైన టిడిపి నేత యనమల రామకృష్ణుడు విరుచుకుపడ్డారు. ఆయనొక పిచ్చి పుల్లయ్య అన్నారు. సీమాంధ్రకు జైరాం చెబుతున్న ప్యాకేజీలకు చట్టబద్దత లేదన్నారు. వార్డు మెంబర్గా కూడా గెలిచే సత్తా జైరాంకు లేదన్నారు. రానున్న ఎన్నికల్లో టిడిపి గెలుపు ఖయమన్నారు. జైరాం తెలుగు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. బెర్లిన్ గోడ గురించి చెబుతున్న కిరణ్ తెలుగు ప్రజల మధ్య ఎవరు గోడ కట్టారో చెప్పాలన్నారు.
మేనిఫెస్టో ప్రకటిస్తాం: శ్రీధర్ బాబు
నవ తెలంగాణ నిర్మాణం కోసం పటిష్ఠమైన పునాదులు వేసేలా ఎన్నికల ప్రణాళిక ఉంటుందని కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సంఘం అధ్యక్షుడు శ్రీధర్ బాబు హైదరాబాదులో తెలిపారు. త్వరలో మేనిఫెస్టో కమిటీ సభ్యులను ప్రకటిస్తామన్నారు. ఆచరణ సాధ్యమైన ప్రణాళికతోనే ప్రజల్లోకి వెళతామన్నారు.
స్థానిక ఎన్నికలపై సుప్రీంలో విచారణ
స్థానిక ఎన్నికలకు సంబంధించి సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. సార్వత్రిక ఎన్నికల జరుగుతున్న నేపథ్యంలో, జెడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలను నిర్వహించడం కష్టతరమని ఈసి సుప్రీం కోర్టుకు తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టును కోరింది. రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు వాదనలు విన్న కోర్టు... ఇబ్బందులను లిఖితపూర్వకంగా ఇవ్వాలని ఆదేశించింది. ఎల్లుండిలోగా అభ్యర్థనను దాఖలు చేయాలని కోరింది.