నేనూ కాపునే..విజయ సాయిరెడ్డి: కాపుల ఆత్మీయ సమావేశంలో గందరగోళం: మంత్రి అవంతి నిలదీత..!
తానూ కాపునేనని రాజ్యసభ సభ్యుడు..వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శ విజయ సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. తన పదోతరగతి సర్టిఫికెట్ లో కులం అన్న చోట కాపు అని రాసి ఉందన్నారు. విశాఖలో కాపుల ఆత్మీయ కలయిక కార్యక్రయానికి ఆయన హాజరు కావటం పైన గందరగోళం చోటు చేసుకుంది. సాయిరెడ్డిని ఎవరు ఆహ్వానించారు..ఎందుకు ఆహ్వానించారు..ఇది వైసీపీ మీటింగా..కాపుల ఆత్మీయ సమావేశమా అంటూ సభకు వచ్చిన వారు మంత్రి అవంతిని నిలదీసారు. ఒక దశలో మంత్రి సైతం సహనం కోల్పోయారు.
దీంతో..అక్కడ కాపు నేతల పేర్లతో నినాదాలు మొదలయ్యాయి. మంత్రి అవంతి అసలు విజయ సాయిరెడ్డి ఎందుకు రావాల్సి వచ్చిందీ వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో కాపు రిజర్వేషన్ పలువురు నేతలు మాట్లాడగా.. ఇలాంటి కార్యక్రమంలో రిజర్వేషన్ గురించి మాట్లాడటం సబబు కాదని అవంతి సర్దిచెప్పారు.
తాను కాపునేనంటూ..విజయసాయిరెడ్డి..
విశాఖలో కాపు సేన ఆధ్వర్యంలో కాపు, తెలగ, బలిజ, తూర్పుకాపు, మున్నూరుకాపు, ఒంటరి కులాలకు చెందిన వారితో కంబాలకొండ వద్ద ఆత్మీక కలయిక పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమాని కి మంత్రి అవంతితో పాటుగా విజయ సాయిరెడ్డి రావటం వివాదానికి కారణమైంది. విజయ సాయిరెడ్డి జ్యోతి ప్రజ్వలన చేయటం పైన అక్కడి కాపు నేతలు అభ్యంతరం వ్యక్తం చేసారు.
తాము కాపుల సమావేశం ఏర్పాటు చేసామని..వైసీపీ సభ కాదని ఆగ్రహించారు. రాజకీయ లబ్ధి కోసం కాపులు కాని వారిని వేదికపై కూర్చోబెట్టి, కాపులను అవమానపరుస్తారా.. వారిని తక్షణం కిందికి దింపాలి.. అని కాపు యూత్ శ్రేణుల తోపాటు మరికొందరు నినాదాలు చేశారు. దీంతో..విజయ సాయిరెడ్డి స్పందిస్తూ తాను కూడా కాపునేనని..నెల్లూరు జిల్లాలో రెడ్డను కాపులుగానే పిలుస్తాని చెప్పుకొచ్చారు. తన పదో తరగతి సర్టిఫికెట్ పైన ఓసీ కాపు అని ఉంటుందని..చెక్ చేసుకోండి అంటూ వివరణ ఇచ్చారు. అయినా..నిరసనలు ఆగకపోవడంతో కొద్దిసేపు ఉండి ఆయన వెళ్లిపోయారు.
మంత్రి అవంతిని నిలదీస్తూ..ఆగ్రహం
విజయ సాయిరెడ్డిని ఆహ్వానించటం..ఆయనకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వటం పైన కార్యక్రమానికి హాజరైన వారు తమ నిరసన కొనసాగించారు. మంత్రి అవంతిని చుట్టుముట్టారు. దీంతో..మంత్రి ఒక దశలో అసహనానికి గురయ్యారు. జిల్లాలో 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక్కడికి.. అదీ అవంతి శ్రీనివాసరావుకే మంత్రి పదవి ఇచ్చారని చెప్పుకొచ్చారు. అర్థమైందా.. అదీ నేనంటే అంటూ ఆగ్రహంగా మాట్లాడారు.
మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టే సహనంతో ఉంటున్నాను... బ్యాక్గ్రౌండ్ లేక కాదు... దయచేసి నా సహనాన్ని పరీక్షించకండి. రిజర్వేషన్ల గురించిమాట్లాడడానికి ఇది కరెక్టు సమయం కాదు అంటూ ఆవేశంతో మంత్రి మాట్లాడారు. అదే సమయంలో పలువురు వంగవీటి..గుడివాడ అమర్నాధ రావు పేర్లను ప్రస్తావిస్తూ వారిద్దరి పేర్లతో అనుకూల నినాదాలు చేసారు. వారు ఉన్న ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేసారు. ఈ సమయంలో సమావేశంలో గందరగోళం ఏర్పడింది.
సాయిరెడ్డిని అందుకే ఆహ్వానించాము
కార్యక్రమానికి హాజరైన కాపు పెద్దలతో మంత్రి ఇదే విషయం పైన చర్చించారు. రెండు సామాజిక వర్గాల వేడుకలకు విజయసాయిరెడ్డితో కలిసి వెళ్లానని..ఈ వేడుకకు తీసుకురాకపోతే బాగోదనే ఆయన్ను ఆహ్వానించామని చెప్పుకొచ్చారు. విశాఖల జిల్లా బాధ్యతలను తొలి నుండి పర్యవేక్షిస్తున్న విజయ సాయిరెడ్డి అక్కడ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ముందు నుండి వ్యూహాలు అమలు చేస్తున్నారు. అందులో భాగంగానే సామాజిక వర్గాల పరంగా ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమావేశాలకు హాజరవుతున్నారు. విశాఖలో పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. అయితే, ఇప్పుడు కాపుల ఆత్మీయ సమావేశంలో పాల్గొనటం..తానూ కాపునని సర్ధిచెప్పే ప్రయత్నం చేయటం..తప్పని పరిస్థితుల్లో తిరిగి వెళ్లిపోవటం అంశం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.