నేను తెలంగాణకు, బాబు..: ఎన్నుకుంటారన్న కెసిఆర్
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల ఫలితాల పైన తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు శుక్రవారం స్పందించారు. తెరాస కార్యాలయం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ భవన్కు వచ్చిన కెసిఆర్కు కార్యకర్తలు బాణసంచా కాల్చుతూ ఘన స్వాగతం పలికారు.
మెజార్టీ కట్టబెట్టినందుకు తెలంగాణ ప్రజలకు తాను శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని చెప్పారు. ఎన్నికల సందర్భంగా తామిచ్చిన హామీలను అన్నింటిని అమలు చేస్తామని చెప్పారు. ప్రజలు తెరాస పైన పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయవద్దన్నారు. ఏకపక్షంగా గెలుపొంది, ప్రధాని కాబోతున్న మోడీకి, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి కాబోతున్న చంద్రబాబుకు అభినందనలు అన్నారు.
రేపు మధ్యాహ్నం 12 గంటలకు తెరాస లెజిస్లేచర్ సమావేశం జరుగుతుందని, నాయకుడిని ఎన్నుకుంటారని చెప్పారు. సాధించుకున్న రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. తెలంగాణలోని ప్రతిపక్ష పార్టీలు కూడా సహకరించాలని కోరారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కావాలన్నారు. తెలంగాణ అభివృద్ధి మాత్రమే పరమావధిగా తాము ముందుకు పోతామన్నారు.
తెలంగాణలో మేజిక్ ఫిగర్ దాటడమే కాకుండా దాదాపు పన్నెండు మందు ఎంపీలను గెలుచుకుంటున్నామన్నారు. భవిష్యత్తు తెలంగాణ నిర్మాణంలో మోడీ సహకారాన్ని తాను కోరుతున్నానని చెప్పారు. అమరవీరుల కుటుంబ సభ్యులను కడుపులో పెట్టుకొని చూసుకుంటామన్నారు. విద్యార్థుల పైన కేసులు ఎత్తివేస్తామన్నారు.
గతంలో జరిగిన నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కు అనుకూలంగా జరిగాయని, ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. తాను అసెంబ్లీకి లేదా లోకసభకు రాజీనామా చేసే విషయం ఇప్పుడు కాదన్నారు. పేదలు వారి సంక్షేమం, వ్యవసాయం, యువతకు ఉద్యోగ అవకాశాల పైన తాము ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు.
దేశంలోనే అత్యాధునిక ఇండస్ట్రియల్ పార్క్ పెడతామన్నారు. చంద్రబాబు తెలంగాణ కోసం పని చేస్తారని, తాను తెలంగాణ కోసం పని చేస్తానని అన్నారు. తమకు సంపూర్ణ మెజార్టీ వచ్చిందని, తమకు ఎవరి మద్దతు అవసరం లేదన్నారు. పోలీసింగ్ వ్యవస్థను ఒక్కటిగా చేస్తామన్నారు. పోలీసు డిపార్టుమెంట్లలో ఎన్నో సంస్కరణలు చేయాల్సి ఉందన్నారు.