ఏపి కంటే 1 ఎక్కువ: ఆర్టీసీ కార్మికులకు కెసిఆర్ బంపర్ ఆఫర్
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు వరాలు కురిపించారు. కార్మికుల డిమాండ్లను సిఎం కెసిఆర్ నెరవేర్చారు. 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలన్న కార్మికుల డిమాండ్కు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
కార్మికులు అడిగిన దానికంటే ఒక శాతం ఎక్కువే ఫిట్మెంట్ ఇచ్చేందుకు సిఎం కెసిఆర్ అంగీకరించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ప్రకటనతో ఎనిమిది రోజులుగా కొనసాగుతున్న సమ్మెకు బుధవారంతో తెరపడింది.
ముఖ్యమంత్రి ప్రకటనపై కార్మిక సంఘాల నేతలు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు టిఎంయూ, ఈయూ నేతలతో సీఎం సమావేశమై కార్మికుల సమస్యలపై చర్చించారు. వారి సమస్యలపై సీఎం కూలంకషంగా చర్చించి 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
కాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కార్మికుల హామీలను నెరవేర్చేందుకు సానుకూలంగా స్పందించింది. 43శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ఏపి ప్రభుత్వం అంగీకరించడంతో ఏపిలో కూడా కార్మికులు సమ్మెను విరమించారు.