మోడీ సన్నాసి..కష్టాలేంతెల్సు, ఎవరో పవన్అట: కెసిఆర్
వరంగల్/కరీంనగర్/నల్గొడ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు బిజెపి ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పైన మరోసారి ధ్వజమెత్తారు. సన్నాసికేం తెలుసు కష్టాలని మండిపడ్డారు. టిడిపి అధినేత చంద్రబాబు బొడ్డులో కత్తితో వస్తున్నాడని హెచ్చరించారు. పొన్నాల లక్ష్మయ్య లాంటి వాళ్లతో మాటలు పడే ఖర్మ తనకు లేదన్నారు. మన తల రాతను మనం రాసుకునే తరుణం ఇదే అన్నారు.
ఉద్యమంలో పేగుతెగేదాక పోరాడిన వారే తెలంగాణ భవిష్యత్తును బాగు చేస్తారని, బంధువో, దోస్తో, కులమో అని ఇతర పార్టీల అభ్యర్థులవైపు మొగ్గు చూపవద్దన్నారు. తెలంగాణను తెచ్చిన పార్టీకే అధికారం కట్టబెట్టాలన్నారు. శనివారం నాలుగు జిల్లాల్లో సుడిగాలి పర్యటన జరిపి ఒకేరోజు 8 సభల్లో పాల్గొన్నారు. వచ్చిన తెలంగాణను రాజకీయ సొల్లుగాళ్లు, దరిద్రులు, మరుగుజ్జుల చేతులలో పెట్టలేక.. బరిలోకి దిగానని చెప్పారు. నూటికి నూరు శాతం సొంతంగా తెరాస ప్రభుత్వం వస్తుందన్నారు.

వచ్చిన తెలంగాణను ఎవరి చేతిలో పెడితే తెలంగాణ భవిష్యత్ భద్రంగా ఉంటుందో ఆలోచించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బలహీన వర్గాలకు చెందిన ప్రతి పేదవాడు గౌరవంగా బతికేందుకు దేశంలో ఎక్కడ లేని విధంగా ఇళ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. మన రాష్ట్రంలో మన జెండాలే ఉండాలని, టిడిపి ఆంధ్రా పార్టీ అని, చంద్రబాబు తెలంగాణను ముంచేందుకు బొడ్డులో కత్తి పెట్టుకుని తిరుగుతున్నాడని విరుచుకుపడ్డారు.
ఎన్నికల తరువాత కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బిజెపితో తెరాస కలవదన్నారు. సోనియా ప్రచార సభల పేరుతో తన సభలకు ఆంక్షలు విధిస్తున్నారని, దీంతో తనకు చాలాసేపు మాట్లాడాలని ఉన్నప్పటికీ ప్రసంగించలేకపోతున్నానన్నారు. పొన్నాలను కెసిఆర్ రాజకీయ పిగ్మీతో పోల్చారు.
ఆయన సొల్లుగాడని, ఆయన గురించి మాట్లాడమే దండగ అన్నారు. మోడీ రాజకీయ సన్నాసి అన్నారు. ఆయనకు ఓటేస్తే చంద్రబాబుకు వేసినట్లేనన్నారు. సిబిఐ కేసు ఉన్న మాజీ మంత్రి గీతారెడ్డి ఎప్పుడు జైలుకు వెళ్తుందో తెలియదన్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ... ఆయన ఎవరో సినిమా యాక్టర్.. తనకు అంతగా తెలియదన్నారు. నరేంద్ర మోడీకి ఇరువైపులా ఆంధ్రోళ్లే అన్నారు. ఒకరేమో చంద్రబాబు మరొకరేమో ఎవరో సినిమా యాక్టర్ అంట అన్నారు.












Click it and Unblock the Notifications