90సీట్లు మావే: కెసిఆర్, 2సార్లు దారితప్పిన హెలికాప్టర్
వరంగల్/ఖమ్మం: రానున్న సార్వత్రిక ఎన్నికలలో తాము 90 స్థానాలు గెలుస్తామని, నివేదికలు కూడా అవే చెబుతున్నాయని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు అన్నారు. ఎన్నికల నేపథ్యంలో ఆయన మంగళవారం పలుచోట్ల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. 2004లో తెరాస వల్లనే కాంగ్రెసు అధికారంలోకి వచ్చిందని, భూపాలపల్లిని జయశంకర్ జిల్లాగా చేస్తామన్నారు. పెండింగ్ ప్రాజెక్టులు కుర్చీ వేసుకొని పూర్తి చేస్తామ్నారు.
రాష్ట్రం ఇస్తే పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయాలా..? రాజకీయ పార్టీలను విలీనం చేసుకోవడానికే మీరు తెలంగాణ ఇచ్చారా..? అని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రాహుల్పై కెసిఆర్ నిప్పులు చెరిగారు. మంగళవారం ఒకేరోజు ఆయన ఏకంగా తొమ్మిది సభల్లో ప్రసంగించారు. వరంగల్ జిల్లా భూపాల్పల్లి, తొర్రూరు, డోర్నకల్ నియోజకవర్గంలోని మరిపెడ, మహబూబాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణం, ఇల్లెందు, కొత్తగూడెం, వైరాల్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు.
తనను మోసగాడంటూ కరీంనగర్ సభలో రాహుల్ అభివర్ణించడంపై కెసిఆర్ భగ్గుమన్నారు. ఎవరికీ వెన్నుపోటు పొడవలేదని, మాట ఇచ్చి వెనక్కి తగ్గి మోసకారిని కాలేదన్నారు. తెలంగాణ ఇవ్వాలంటూ గత సెప్టెంబర్లో ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దల ఇంటి చుట్టూ గడపగడపకు తిరిగామని, వాళ్ల కడుపులో తలపెట్టి తెలంగాణకు సానుకూలత వ్యక్తం చేయాలని అడిగానని కానీ, అప్పు డు కాంగ్రెస్ ఏమాత్రం స్పందించ లేదన్నారు.

దాంతో అదే నెలలో కరీంనగర్లో మేధో మథన సదస్సు పెట్టి తెలంగాణ సాధనకు ప్రణాళిక రూపొందించామన్నారు. పోరాట మార్గంలోనే ముందుకు పోవాలని నిర్ణయించామని, ఆ దారిలో నే వెళ్లి తెలంగాణ సాధించామన్నారు. అమరుల త్యాగం, తెరాస రాజకీయ పోరాటాల కారణంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. తెలంగాణలో అధికారం తమదేనని కెసిఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో తెరాస 85 నుంచి 90 అసెంబ్లీ స్థానాలు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంద ని భరోసాగా చెప్పారు. తెలంగాణలో ఎటు చూసినా తెరాస గాలి బలంగా వీస్తోందన్నారు.
కెసిఆర్ పిట్ట కథ
కెసిఆర్ మానుకోట బహిరంగ సభలో ఓ పిట్టకథ చెప్పారు. ఒక ఊరిలో భార్యాభర్తలు కాపురం చేసుకుంటున్నారు. వారిలో భర్త ఆంధ్రా పార్టీకి చెందినవాడు. ఇంట్లో ఆయన తల్లిదండ్రుల ఫొటోను గోడకు తగిలించుకున్నాడు. ఆ పార్టీ వద్దని భార్య చెబితే వినడు. ఒకరోజు ఆయన భార్య తల్లిదండ్రుల ఫొటోను తీసేసి పక్కింటోళ్ల తల్లిదండ్రుల ఫొటో తగిలిస్తుంది. ఇంటికి వచ్చిన ఆయన ఇదేమిటని అఢిగితే.. దాంతో మన తెలంగాణలో ఉంటూ నువ్వు ఆంధ్రా పార్టీలో ఎలా ఉన్నావు? అంటూ ఆమె అడుగుతుంది. దాంతో అతనికి కనువిప్పు కలుగుతుంది.
హెలికాప్టర్ పర్యటనతో చిక్కు
వరంగల్ జిల్లా మహబూబాబాద్ సభ పూర్తి చేసుకొని తొర్రూరుకు వెళ్లాల్సిన కెసిఆర్ హెలికాప్టర్ పొరపాటున మరిపెడకు వెళ్లింది. పొరపాటును గుర్తించి తిరిగి తొర్రూరుకు చేరుకుంది. ఖమ్మం సభ అనంతరం మణుగూరు వెళ్లాల్సి ఉండగా పైలట్ హెలికాప్టర్ను భద్రాచలం వైపు తీసుకు వెళ్లారు. ఇద్ గుర్తించిన కెసిఆర్ తిరిగి మణుగూరు వెళితే ఆలస్యం అవుతుందని ఇల్లెందు సభకు హాజరయ్యారు. మణుగూరు సభ రద్దయింది.












Click it and Unblock the Notifications