ఆ క్షణంలోనూ జై తెలంగాణ అన్నారు: సభలో కెసిఆర్
హైదరాబాద్: అనేకమంది ప్రజలు, విద్యార్థుల బలిదానాల వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అన్నారు. 1969 నుంచి సాగిన ఉవ్వెత్తున సాగిన తెలంగాణ ఉద్యమంలో అనేకమంది తమ ప్రాణాలను త్యాగం చేశారని గుర్తు చేశారు. శనివారం తెలంగాణ సభ సమావేశాలు ఉదయం 10 గంటల ప్రాంతంలో ప్రారంభమైమయ్యాయి. ముఖ్యమంత్రి కెసిఆర్ అమరుల త్యాగాలను స్మరిస్తూ సంతాప తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రా ప్రాంతంతో తెలంగాణను కలిపిన 1956లోనే తెలంగాణ ప్రజలు దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. దివంగత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ కల సాకారమైన తరుణం లేకపోవడంతో తనకు వ్యక్తిగతంగా లోటని, అలాగే తెలంగాణకు తీరనిలోటని కెసిఆర్ అన్నారు. తెలంగాణను ఆంధ్రా ప్రాంతంతో కలపడాన్ని వ్యతిరేకించిన తొలి వ్యక్తి జయశంకర్ అని చెప్పారు. ఆయన విద్యార్థి దశ నుంచే తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారని చెప్పారు.
రావు సాబ్ అని తనను జయశంకర్ పిలిచేవారని గుర్తు చేసుకున్నారు. సీమాంధ్రతో కలపడం వల్ల తెలంగాణ ప్రాంతం కుంగిపోయిందని చాలా వెనకబడి పోయిందని చెప్పారు. తెలంగాణ ప్రజలు పడుతున్న బాధలు చూసి, తాను 1969 ఉద్యమ సమయంలోనే మరణించి ఉంటే బాగుండేదని జయశంకర్ తనతో చెప్పేవారని అన్నారు. శ్రీకాంతాచారి ఆత్మ బలిదానంతో మలిదశ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగిందని కెసిఆర్ చెప్పారు.
తెలంగాణ కోసం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులు, యువకులు ఎవరూ కూడా తాము చనిపోతున్న సమయంలో అమ్మా అయ్యా అని అరవలేదని.. జై తెలంగాణ అని నినదించారని కెసిఆర్ చెప్పారు. ప్రాణత్యాగానికి మించిన త్యాగముండదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుతో విద్యార్థులు, ప్రజల బలిదానాలు వృథా కాలేదని కెసిఆర్ అన్నారు.
1969లో
జరిగిన
తెలంగాణ
తొలిదశ
ఉద్యమంలో
369
మంది
ప్రాణత్యాగం
చేయగా,
మలిదశ
తెలంగాణ
ఉద్యమంలో
సుమారు
1200మంది
విద్యార్థులు,
యువకులు
బలిదానాలు
చేశారని
అన్నారు.
వారందరికీ
శాంతి
చేకూరాలని
సభ
జోహార్లు
అర్పిస్తూ
సంతాపం
వ్యక్తం
చేస్తోందని
కెసిఆర్
తెలిపారు.
కెసిఆర్ ప్రవేశపెట్టిన అమరవీరుల సంతాప తీర్మానాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చిన్నారెడ్డి తమ పార్టీ తరపున సమర్థిస్తున్నట్లు తెలిపారు. అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అమరవీరుల సంతాప తీర్మానాన్ని తాము స్వాగతిస్తున్నామని, సమర్థిస్తున్నామని తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి అన్నారు. 1969లో ఖమ్మంలోని పాల్వంచలోనే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని తెలిపారు. ఉద్యమానికి ఉస్మానియా వేదికైందని తెలిపారు. శ్రీకాంత్ చారి మృతి చెందిన రోజును అమరవీరుల స్మారకదినంగా ప్రభుత్వం జరపాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులు కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ జయంతి ఉత్సవాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని కోరారు. ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు ప్రభుత్వం ఏవిధమైన సాయం చేయాలనుకున్నా తాము సమర్థిస్తామని చెప్పారు.