రేపు కిరణ్ రెడ్డి పార్టీ పేరు: టీలోనూ పోటీకి రెడీ
హైదరాబాద్: తన పార్టీ పేరును మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రేపు శనివారం తిరుపతిలో ప్రకటిస్తారని ఆయన వర్గానికి చెందిన పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి చెప్పారు. పార్టీ జెండా, ఎజెండాలను మాత్రం ఈ నెల 12వ తేదీన రాజమండ్రి బహిరంగ సభలో వెల్లడిస్తారని ఆయన శుక్రవారం చెప్పారు. కొత్త పార్టీ పెట్టాల్సిన అవసరం ఉందని సర్వేలో తేలిందని ఆయన అన్నారు.
కాగా, కిరణ్ కుమార్ రెడ్డి పార్టీ వచ్చే లోకసభ, శాసనసభ ఎన్నికల్లో సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలోని కొన్ని నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులను పోటీకి నిలిపే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలా, వద్దా అనే విషయంపై తర్జనభర్జనలు పడుతున్నారు.
సీమాంధ్రలో జిల్లాకు నాలుగు నుంచి ఐదు అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్నా ప్రభుత్వం ఏర్పాటులో కీలక పాత్ర పోషించడం ఖాయమని కిరణ్ కుమార్ రెడ్డి అనుచురులు చెబుతున్నారు. రాష్ట్రంలో నాలుగైదు ఎంపీ స్థానాలు గెలుచుకున్నా గొప్ప విజయాన్ని సాధించినట్లే అవుతుందని అంటున్నారు.
అయితే, కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతు లభించడం అంత తేలిక కాదని అంటున్నారు. సొంత చిత్తూరు జిల్లాలోనే నిన్న మొన్నటి వరకూ కిరణ్ వెంట ఉన్న కొంత మంది కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. విద్యార్థులకు, జర్నలిస్టులకు తమ పార్టీ నుండి పోటీ చేసే అవకాశం కల్పిస్తానని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీంతో కొత్తవారికి టికెట్లు దండిగా ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.