చర్చ జరగాలి: కిరణ్, టిడిపి, జగన్లకి శైలజానాథ్ చురక
చర్చకు సిద్ధం: శైలజానాథ్
తెలంగాణ ముసాయిదా బిల్లు పైన చర్చకు ప్రభుత్వం, కాంగ్రెసు పార్టీ సిద్ధంగా ఉందని మంత్రి శైలజానాథ్ అన్నారు. చర్చను వ్యతిరేకిస్తే విభజనకు అంగీకరించినట్లే అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు, సీమాంధ్ర తెలుగుదేశం పార్టీలు చర్చను వ్యతిరేకిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వాటికి శైలజానాథ్ కౌంటర్ ఇచ్చారు. చర్చను వ్యతిరేకిస్తే విభజనకు అంగీకరించినట్లే అవుతుందన్నారు. ఆర్థిక అంశాలకు సంబంధించి కేంద్రానికి లేఖ రాశామని, పూర్తి సమాచారం వచ్చాక సభ్యులకు అంద జేస్తామన్నారు. తొమ్మిది కోట్ల మంది ప్రజలు చర్చ జరిగితే చూడాలనుకుంటున్నార్నారు.
నా జీవితంలో చూడలేదు: రామచంద్రయ్య
ఇలాంటి బిల్లును తాను తన జీవితంలో చూడలేదని మంత్రి రామచంద్రయ్య అన్నారు. బిల్లుపై చర్చ జరిగితేనే బాగుంటుందన్నారు. ఇది పూర్తిస్థాయి బిల్లు కాదని, ముసాయిదా బిల్లు మాత్రమేనని చెప్పారు. ఆర్థిక అంశాలు, కొత్త రాజధాని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి బిల్లులో లేవన్నారు. ఇలాంటి బిల్లుపై చర్చ జరిగి తిరస్కరిస్తేనే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
అప్పుడే చర్చ చేపడతాం: యనమల
బిల్లు సంపూర్ణంగా లేదని, దానిని మంత్రులే అంగీకరిస్తున్నారని, అలాంటప్పుడు సంపూర్ణంగా బిల్లు వచ్చినప్పుడే చర్చ చేపడతామని తెలుగుదేశం పార్టీ శాసన మండలి పక్ష నేత యనమల రామకృష్ణుడు అన్నారు. బిల్లు తప్పుల తడకగా ఉందని రుద్రరాజు పద్మరాజు అన్నారు.