బాబు, కేసీఆర్ మాట్లాడినా, మాట్లాడుకోపోయినా: కేకే
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుకున్నా, మాట్లాడుకోకపోయినా మీడియా అనవసర ప్రాధాన్యం ఇస్తోందని తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంటరీ నేత కే కేశవ రావు ఆదివారం అన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉంటే మంచిదని, శత్రుత్వంతో కూడిన పోటీ ఉండవద్దని కేకే అన్నారు.
పార్టీని మరింత బలోపేతం చేయబోతున్నామని, సంబంధిత ప్రణాళికను త్వరలోనే ప్రకటిస్తామని ఆయన తెలిపారు. పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర సమస్యల పైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు. హైకోర్టు విభజన అంశం పైన న్యాయవాదుల ఐక్యకార్యాచరణ సమితి ఈ నెల 6న ఢిల్లీకి వెళ్తుందన్నారు. తాము న్యాయశాఖ మంత్రి, ప్రధానమంత్రిలను కలుస్తామని, పార్లమెంటులో పట్టుబడతామని చెప్పారు.
కాంగ్రెస్ బాటలోనే తెరాస
మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెరాస ప్రభుత్వం కాంగ్రెస్ బాటలో పయనిస్తోందని, కానీ కాంగ్రెస్కు కోర్టుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైందో తెరాస గమనించాలని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ తెరాస హామీ ఇచ్చిందని, ఇది ఓటు బ్యాంకు రాజకీయాలకు పనికొస్తుందే తప్ప వారి అభివృద్ధికి పనికి రాదన్నారు.
ఇప్పటికే కాంగ్రెస్ ఇలాంటి రిజర్వేషన్లు తెస్తే, మతపర రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమంటూ కోర్టులు కొట్టేశాయన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ అదే బాటలో పయనిస్త్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు దత్తాత్రేయ కొన్ని ప్రశ్నలు సంధించారు.
తెలంగాణ పిల్లలకు మాత్రమే ఫీజు రీయింబర్స్ చేస్తామంటున్నారు కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామని చెప్పిందని, అయితే తెలంగాణలో ఉన్న పేద విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుందా లేదా? ఫీజు రీయింబర్మెంట్ పథకం కేజీ టు పీజీ విద్యలో భాగం కాదా అని ప్రశ్నించారు. స్థానికత అంశం, ముల్కీ నిబంధన ఒక్కటే కాదా? ముల్కీ ఆధారంగానే 371 (డీ)కు తుది రూపమిచ్చిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నల వర్షం కురిపించారు.