ఉప్పెనలో కొట్టుకుపోవద్దు: జగన్, కిరణ్లకి కెకె హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణ ఉద్యమం తుఫాన్ కాదని ఉప్పెన అని ఆ ఉప్పెనలో కొట్టుకుపోయే ప్రయత్నం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేయవద్దని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత కె కేశవ రావు ఆదివారం అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా కిరణ్ వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. విభజన తుఫాన్ను ఆపుతానని ముఖ్యమంత్రి చెప్పడం సరికాదని చెప్పారు.
అప్పుడు తెలంగాణ ప్రజలను, ఇప్పుడు సీమాంధ్ర ప్రజలను సీమాంధ్ర నేతలు మోసం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సొంత అజెండా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. తెలంగాణకు అన్ని రంగాలలో అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. విభజనను అడ్డుకుంటానని ఎవరు చెప్పినా అది అవివేకమే అవుతుందన్నారు.

రాజీనామా చేసి సమైక్య ఉద్యమాన్ని నడిపించుకోవచ్చునన్నారు. నీటి కేటాయింపులపై ముఖ్యమంత్రి రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదన్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు అర్థరహితమన్నారు. ముఖ్యమంత్రి కుట్రలను అడ్డుకునే బాధ్యత తెలంగాణ ప్రాంత మంత్రులదే అన్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులో సభ పెట్టడం ఆయనకు మంచిది కాదన్నారు. ఆ పార్టీ సీనియర్ నేతలు మైసూరా రెడ్డి లాంటి నేతలు జగన్కు సలహాలు ఇవ్వాలని సూచించారు.
విభజన ఖరారు అయిందని ముఖ్యమంత్రికి తెలుసునని పెద్దపల్లి ఎంపి వివేక్ అన్నారు. ముఖ్యమంత్రి సమైక్యవాదం వినిపించాలనుకుంటే ఆ పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమానికి నాయకత్వం వహించినా తమకు అభ్యంతరం లేదన్నారు. విభజన ఆపుతానని ముఖ్యమంత్రి అనడం వెనుక కుట్ర అనుమానం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications