పై నుంచి కోడెల పిలుస్తున్నాడా ? చంద్రబాబుపై సాయిరెడ్డి సంచలన ట్వీట్ !
ఏపీలో చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ను ఉద్దేశించి వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పెట్టే ట్వీట్లు ఎప్పుడూ సంచలనం రేపుతుంటాయి. ఇందులో విజయసాయిరెడ్డి చేసే వ్యాఖ్యలపై టీడీపీ నేతలు కూడా ఎప్పటికప్పుడు కౌంటర్లు వేస్తూనే ఉంటారు. అయినా సాయిరెడ్డి కూడా ఎక్కడా తగ్గరు. కర్నూలు జిల్లాల్లో చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలపై సాయిరెడ్డి ఇదే కోవలో మరోసారి రెచ్చిపోయారు.
కర్నూలు జిల్లా టూర్ లో తనకు ఇవే చివరి ఎన్నికలంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్ని ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన చంద్రబాబుపై వ్యంగాస్త్రాలు సంధించారు. అందులోనూ చంద్రబాబుపై వ్యక్తిగతంగా విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఇంట్లో కట్టేయాలంటూ సాయిరెడ్డి వ్యాఖ్యానించారు. గతంలో కుప్పంలో స్ధానిక ఎన్నికల్లో టీడీపీ ఓటమిని గుర్తుచేస్తూ చంద్రబాబును సాయిరెడ్డి ఓ ఆటాడుకున్నారు. అంతటితో ఆగకుండా ఎప్పుడో చనిపోయిన మాజీ మంత్రి కోడెలను కూడా ఇందులోకి లాగారు.
కర్నూల్లో చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందిస్తూ.. నైరాశ్యంతో పోయేట్టున్నాడు మా చంద్రం అన్నయ్య. నాలుగు రోజులు కట్టేసైనా ఇల్లు కదలకుండా చేయండయ్యా ! కుప్పం ప్రజలు తరిమికొట్టినప్పుడే లాస్ట్ ఎలక్షన్ అని అర్ధమైంది. మనకు మళ్లీ ఈ ఏడుపులేంటి అన్నయ్యా ? పై నుంచి కోడెల పిలుస్తున్నాడా అంటూ సాయిరెడ్డి తన ట్వీట్ ముగించారు. తద్వారా ఎప్పుడో కుప్పంలో ఓడినప్పుడే మీకు లాస్ట్ ఎలక్షన్ అయిందని, ఇప్పుడు మళ్లీ కర్నూల్లో వచ్చే ఎన్నికలు తనకు చివరివంటూ చంద్రబాబు చెప్పడమేంటనే విషయాన్ని సాయిరెడ్డి ప్రశ్నించారు.