కుప్పంలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్ - "హీరో" ఎంట్రీతో సీన్ మార్చేసేలా : చంద్రబాబుకు షాక్ తప్పదా..!!
ఏపీలో వచ్చే ఎన్నికల పైనే ఇప్పుడు చర్చ మొత్తం నడుస్తోంది. వైసీపీ తిరిగి అధికారం దక్కించుకొనేందుకు అప్పుడే పావులు కదుపుతోంది. టీడీపీకి వచ్చే ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. ఖచ్చితంగా గెలిస్తేనే పార్టీకి భవిష్యత్. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా అప్పుడే జిల్లా యాత్రలు ప్రారంభించి.. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ను ముందుగా ఢిఫెన్స్ లోని నెట్టే వ్యూహాలకు వైసీసీ నాయకత్వం పదును పెడుతోంది.
అందులో భాగంగా ఈ సారి కుప్పంలో సైత వైసీపీ జెండా ఎగరాలని సీఎం జగన్ బలమైన ఆకాంక్షతో ఉన్నారు. అందు కోసం చంద్రబాబు పైన పోటీకి ఊహించని విధంగా కొత్త వ్యక్తిని తెర పైకి తీసుకొచ్చేందుకు నిర్ణయించారు.
కుప్పంలో వైసీపీ కొత్త వ్యూహం
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ఎన్నడూ లేని విధంగా చంద్రబాబు సొంత నియోజకవర్గంలో వరుసగా స్థానిక - మున్సిపల్ ఎన్నికలు గెలిచి ఉత్సాహంతో ఉంది. వచ్చే ఎన్నికల పైన ఫోకస్ పెట్టింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామంటూ జిల్లా మంత్రి పెద్దిరెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారు. అయితే, చంద్రబాబు సైతం గతం కంటే ఎక్కువగా ఈ సారి తన నియోజకవర్గం పైన శ్రద్ద పెట్టారు.
తరచూ పర్యటనలు చేస్తున్నారు. ఇదే సమయంలో వైసీపీ నుంచి ఈ సారి కుప్పంలో అభ్యర్ది ఎవరనే దాని పైన పలు పేర్లు తెర పైకి వచ్చాయి. అందులో భాగంగా.. మంత్రి పెద్దిరెడ్డి సోదరుడి కుమారుడు పెద్దిరెడ్డి సుధీర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అదే సమయంలో బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాల్సి వస్తే ఇద్దరి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నాయి.
చంద్రబాబు పై పోటీగా విశాల్
ఇక, ఈ చర్చ సాగుతున్న సమయంలోనే వైసీపీ కొత్త అభ్యర్ధి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఊహించని విధంగా సినీ హీరో విశాల్ ను వైసీపీ నుంచి కుప్పం బరిలో నిలిపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. 1989 నుంచి ఇప్పటి వరకు ఏడు సార్లు కుప్పం నుంచి గెలిచిన చంద్రబాబుకు ఈ సారి జలక్ ఇవ్వాలనే పట్టుదలతో ఉన్న వైసీపీ అధినాయకత్వం ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు చెబుతున్నారు.
విశాల్ రెడ్డి సామాజిక వర్గంకు చెందిన వారు. జగన్ పైన అభిమానం ఉన్న హీరో. పలు సందర్భాల్లో తనకు జగన్ పైన ఉన్న అభిమానాన్ని బయట పెట్టారు. విశాల్ తమిళ్ హీరో అయినా ఆయన పూర్వీకులు..సంబంధాలు కుప్పం నియజకవర్గ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్నాయని చెబుతున్నారు. ఆయన తండ్రి జీకే రెడ్డి ప్రముఖ బిల్డర్ గా రియల్టర్ గా నిర్మాతగా ఉన్నారు.
సీఎం జగన్ - విశాల్ మధ్య సత్సంబంధాలు
సీఎం జగన్ పైన అభిమానంతో పాటుగా మంచి వ్యక్తిగత సంబంధాలు ఉండటంతో..విశాల్ ను కుప్పం బరిలోకి దించేందుకు పావులు వేగంగా కదులుతున్నాయి. కుప్పం నియోజకవర్గ గ్రామాల్లో తమిళ ఓటర్ల సంఖ్య సైతం గణనీయంగా ఉంది. విశాల్ వైసీపీ నుంచి బరిలోకి దిగితే ఇటు తెలుగు..అటు తమిళ ఓటర్లు సైతం మద్దతుగా నిలుస్తారనేది మరో అంచనా.
విశాల్ కు హీరోగా ఉన్న క్రేజు.. వైసీపీకి ఉన్న ఆదరణ కలిస్తే సీఎం జగన్ లక్ష్యం నెరవేరుతుందని పార్టీ నేతలు చెబుతున్నారు. విశాల్ నటించిన తెలుగు సినిమాలు సైతం ఎక్కువగా ఏపీలోని సీమ ప్రాంతానికి చెందిన నేపథ్యమే కనిపిస్తోంది. తమిళ నటీనటుల సంఘానికి ప్రెసిడెంట్ గానూ విశాల్ వ్యవహరించారు.
అదే జరిగితే ..సీన్ మారిపోయేనా
టీడీపీ అధినేత చంద్రబాబును సొంత నియోజకవర్గంలోనే గట్టి పోటీ ఇచ్చి..కట్టడి చేస్తే..సైకలాజికల్ గా పై చేయి సాధించటమే వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. కుప్పం లో ఉన్న రాజకీయ పరిస్థితులు.. ఓటర్ల గురించి ఇప్పటికే సీఎం జగన్ పూర్తి ఫీడ్ బ్యాక్ సర్వే సంస్థల ద్వారా సేకరించినట్లుగా సమాచారం. దీంతో.. వ్యూహాత్మకంగా ఇప్పుడు విశాల్ పేరు తెర పైకి వచ్చింది.
దీని పైన విశాల్ అంగీకరించి.. పోటీకి ముందుకొస్తే..ఈ సారి ఎన్నికల్లో ఏపీలో ఆసక్తి కర పోరు సాగే నియోజకవర్గాల్లో కుప్పం తొలి స్థానంలో నిలుస్తోంది. దీంతో..ఇప్పుడు వైసీపీ ఏ రకంగా విశాల్ ను ఒప్పిస్తుందీ... విశాల్ బరిలో దిగేందుకు సిద్దమేనా అనేది అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో.. పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.