టీడీపీ ఆఫీస్పై ఎమ్మార్పీఎస్ దాడి, ఉద్రిక్తత : జగన్ పనేనని శిల్పా
కర్నూలు: నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) నేతలు విరుచుకుపడ్డారు. కర్రలు చేతబట్టి టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. టీడీపీ నేతలు తేరుకునేలోగానే ఎమ్మార్పీఎస్ నేతలు పార్టీ కార్యాలయంలో బీభత్సం సృష్టించారు.
ఈ దాడిలో పార్టీ కార్యాలయంలోని ఫర్నీచర్ ఫూర్తిగా ధ్వంసమైంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణకు తాము సిద్ధమని చెప్పి.. అధికారంలోకి వచ్చాక విస్మరించారని ఎమ్మార్పీఎస్ నేతలు మండిపడ్డారు.
దాడి వెనక జగన్: శిల్పా
ఎమ్మార్పీఎస్ నేతలు టీడీపీ కార్యాలయంపై దాడి చేయడంపై ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వేగంగా స్పందించారు. తమ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి వెనుక వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధిపతి, విపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి హస్తముందని ఆయన ఆరోపించారు.
పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వర్గీకరణకు కట్టుబడి ఉన్నారని, మాదిగలకు చంద్రబాబు మాత్రమే న్యాయం చేస్తారన్న విషయాన్ని ఎమ్మార్పీఎస్ నేతలు గుర్తించాలని ఆయన కోరారు. అణగారిని వర్గాలకు చంద్రబాబు ప్రభుత్వమే న్యాయం చేస్తుందని తెలిపారు.