వెనక్కి తీస్కొండి: టిపై లగడపాటి లేఖ, కొట్టుకున్న కాంగ్
హైదరాబాద్: కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ సోమవారం కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత జనార్ధన్ ద్వివేదికి లేఖ రాశారు. తెలంగాణకు అనుకూలంగా 2013 జూలై 30వ తేదిన తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. ఈ నెల 17న జరిగే ఏఐసిసి కార్యవర్గ సమావేశంలో తెలంగాణ ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాలన్నారు.

తప్పుదోవ పట్టిస్తున్నారు: దూళిపాళ్ల
తెలంగాణ బిల్లు పైన చర్చ జరిగినప్పుడు తెరాస శాసన సభా పక్ష నేత ఈటెల రాజేందర్ ప్రాజెక్టుల నిర్మాణంపై వక్రీకరిస్తూ శాసన సభను తప్పుదోవ పట్టించారని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. తెలంగాణను ఏడారి చేసే పొరుగు రాష్ట్రాల అక్రమ నిర్మాణాలపై నేతలు ఎందుకు మాట్లాడటం లేదన్నారు.
కిరణ్ వ్యక్తిగతం: దానం
మజ్లిస్ పార్టీతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఉన్న విభేదాలు ఆయన వ్యక్తిగతమని కార్మిక శాఖ మంత్రి దానం నాగేందర్ హైదరాబాదులో అన్నారు. మజ్లిస్ పార్టీతో తమ పార్టీ అధిష్టానానికి మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. వచ్చే ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలాలేదా అనే అంశాన్ని అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
భువనగిరిలో ఉద్రిక్తత
నల్గొండ జిల్లాలోని భువనగిరిలో కాంగ్రెసు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత ఏర్పడింది. ఏఐసిసి పరిశీలకుల ఎదుటే రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. భువనగిరి పార్లమెంటు సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దామోదర్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్ల దాడికి దిగారు. చెప్పులు విసురుకున్నారు. పోలీసులు లాఠీఛార్జ్ చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం రాజగోపాల్ రెడ్డి పోలీసు స్టేషన్ ఎదుట బైఠాయించి దామోదర్ రెడ్డి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications