చంద్రబాబుకు కొణతాల ట్విస్ట్: టిడిపి కాదు వైసిపి లోకి ..చక్రం తిప్పారు: మాగుంట రాజీనామా..!
టిక్కెట్ల రచ్చ సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టిడిపి అధినేత కు షాక్ ఇచ్చారు. ఇక, టిడిపి లో చేరటమే మిగిలిందని భావిస్తున్న సమయంలో ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. టిడిపి కాదు..వైసిపి లో చేరుతున్నా నని ప్రకటించారు. ఎంతో కాలంగా ప్రచారం జరుగుతున్న విధంగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపిక రాజీనామా చేసారు. రేపు వీరిద్దరూ వైసిపి లో చేరుతున్నారు...
వైసిపి లోకి కొణతాల..
మాజీ మంత్రి..ఉత్తరాంధ్ర హక్కుల కోసం పోరాడుతున్న కొణతాల రామకృష్ణ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆయన కొద్ది రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు తో సమావేశమయ్యారు. ఆయన టిడిపిలో చేరటం ఖాయమనే ప్రచారం జరి గింది. ఆయనకు టీడీపీలో టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరి గింది. ఆయన అనూహ్యంగా వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. శుక్రవారం ఉదయం ఆయన లోటస్ పాండ్ తో జగన్ సమక్షంలో వైసిపి లో చేరుతున్నారు.
మాగుంట రాజీనామా..
కొంత కాలంగా ప్రచారం జరుగుతున్న విధంగానే టిడిపి ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టిడిపికి రాజీనామా చేసారు. ఆయనను ఒంగోలు ఎంపీగా బరిలోకి దిగాలని ముఖ్యమంత్రి కోరారు. ససేమిరా అన్నారు. పార్టీ వీడవద్దని టిడిపి నేతలు ఒత్తిడి చేసారు..చివరి వరకూ ప్రయత్నాలు చేసారు. అయినా..ఆయన అంగీకరించ లేదు. టిడిపి కి రాజీనామా చేసిన మాగుంట శుక్రవారం వైసిపి లో చేరుతున్నారు. ఆయన ఒంగోలు లేదా నెల్లూరు లోక్సభకు వైసిపి నుండి పోటీ చేయనున్నారు. మాగుంట ను నెల్లూరు లోక్సభ నుండి బరిలోకి దింపితే..నెల్లూరు ఎంపి మేకపాటి రాజ మోహన రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారు.
చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్ నౌ స్టింగ్ ఆపరేషన్...!
దాడి..కొణతాల ఇద్దరూ వైసిపి లోనే..
వైసిపి ఏర్పడిన తరువాత విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు..కొణతాల రామకృష్ణ ఇద్దరూ వైసిపి లో పని చేసారు. ఎన్నికల తరువాత వారు పార్టీని వీడారు. కొద్ది రోజుల క్రితం దాడి వీరభద్రరావు వైసీపీలో చేరా రు. కొణతాల కూడా వైసీపీలో చేరనున్నారనే వార్తలతో రాజకీయం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియని పరిస్థితి విశాఖ జిల్లాలో నెలకొంది. కొణతాల టిడిపి లో చేరుతారని ప్రచారం జరిగింది. అయితే, కొణతాల అమరావతి లో చంద్రబాబు ను కలిసి వచ్చిన తరువాత వైసిపి ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. కొణతాల కె ఎంపి సీటు ఆఫర్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఉత్తరాంధ్ర కు చెందిన ఒక నేత.. జగన్ కు కుడిభుజం గా వ్యవహరిస్తున్న మరో నేత చివరి నిమిషంలో చక్రం తిప్పారు. ఫలితంగా కొణతాల వైసిపి లో చేరాలని నిర్ణయించారు.