అనుమానంతో భార్యను చంపి పూడ్చిపెట్టాడు
విజయవాడ: అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసిన సంఘటన విజయనగరం జిల్లాలో జరిగింది. నాగరాజు అనే వ్యక్తి తన భార్య రాధను హత్య చేసి మృతదేహాన్ని రహస్యంగా విజయవాడ తరలించి లక్ష్మీపురం శ్మశానవాటికలో ఖననం చేశాడు. అనుమానంతో పోలీసులు నాగరాజును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీంతో భార్యను అతనే హత్య చేశాడని పోలీసులు నిర్ధారించుకున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టివేత
నెల్లూరు, గుంటూరు, కర్నూలు జిల్లాల్లోని దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠను అరెస్టు చేసినట్లు నెల్లూరు జిల్లా ఎస్పీ ఎస్ సెంథిల్ కుమార్ చెప్పారు. వారి నుంచి 13 లక్షల రూపాయల విలువైన బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నెల్లూరు సిసిఎస్, కర్నూలు జిల్లా నందికొట్కూరు పోలీసులు సంయుక్తంగా ఈ ముఠాను పట్టుకున్నట్లు ఆయన చెప్పారు.
గంజాయి పట్టివేత
విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో గంజాయి తరలిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.50 లక్షల విలువ చేసే గంజాయిని, మూడు కార్లను స్వాధీనం చేసుకున్నారు.
అటవీ సిబ్బందిపై స్మగ్లర్ల దాడి
చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లె సమీపంలో టేకుమానుల అటవీ ప్రాంతంలో ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సిబ్బందిపై దాడి చేశారు. ఈ ఘటనలో డిఆర్వో నటరాజుకు స్వల్పంగా గాయాలయ్యాయి. పోలీసుల రాకతో ఎర్రచందనం స్మగ్లర్లు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనాస్థలంలో పోలీసులు గొడ్డళ్లు, కర్రలు, వంట పాత్రలు స్వాధీనం చేసుకున్నారు.
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
ప్రకాశం జిల్లా కారంచేడు - చీరాల ప్రధాన రహదారిపై సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. వినుకొండ అగ్రిగోల్డ్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్న ఎన్. రాంబాబు (40) అతని మిత్రుడు ఆర్. సురేష్ (40)తో కలిసి ద్విచక్రవాహనంపై చీరాల వస్తుండగా ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారితో పాటు లారీలో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు.