ఎవరా స్పాన్సర్స్? డ్రోన్స్ ఆపరేట్ చేసింది ముద్రగడ కుమారుడే : సుధాకర్ నాయుడు సంచలనం
రాజమహేంద్రవరం : తుని విధ్వంస ఘటకు సంబంధించి విచారణకు హాజరైన వన్ న్యూస్ చానెల్ యజమాని మంచాల సుధాకర్ నాయుడు వెల్లడించిన వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ముద్రగడకు ప్రతికూలంగా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో.. కాపు సభను ముద్రగడ ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించారన్న అర్థం ఆయన వ్యాఖ్యల్లో వెల్లడవుతోంది.
రాజమహేంద్రవరంలో విచారణకు హాజరైన సందర్భంగా సుధాకర్ నాయుడు పలు సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. తుని సభకు ముందు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం తనను కలిసి మద్దతు కోరారని, మీడియా పరంగా ముద్రగడకు సహకరించేందుకు తాను అంగీకారం తెలిపినట్లుగా సుధాకర్ నాయుడు తెలిపారు. అయితే సభ సందర్బంగా.. ముందుగా చెప్పినట్లు ఒకరి తర్వాత మరొకరిని మాట్లాడించకుండా.. సభ మొత్తం ముద్రగడనే మాట్లాడారని చెప్పారు.
సభకు హాజరైన జనాన్ని రెచ్చగొట్టబట్టే.. విధ్వంసం చోటు చేసుకుందని సీఐడీ అధికారుల విచారణలో తేలింది. సభలో ఉపయోగించిన డ్రోన్ కెమెరాలను హైదరాబాద్ నుంచి తెప్పించారని సీఐడీ అధికారులు నిర్దారించారు. దీనిపై సీఐడీ అధికారుల విచారణలో ప్రశ్నలు ఎదుర్కొన్న సుధాకర్ నాయుడు.. డ్రోన్ కెమెరాలను హైదరాబాద్ లోనే కొనుగోలు చేశారని, వీటిని ముద్రగడ కుమారుడే ఆపరేట్ చేశారని వివరించాడు. అయితే ఈ డ్రోన్స్ కు స్పాన్సర్ గా ఎవరు వ్యవహరించారనేది మాత్రం తనకు తెలియదని చెప్పినట్లు సమాచారం.
కాపుల కోసం జరుగుతున్న ఉద్యమం కాబట్టి.. తుని సభకు హాజరయ్యానని, పట్టాల మీదకు రావాలంటూ ముద్రగడ పిలుపునివ్వడంతో ఒక్కసారిగా తాను ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చారు. రైలును తగలబెట్టాలనే ఉద్దేశం సభకు హాజరైన యువకుల్లో లేదని, వారిని రెచ్చగొట్టడం వల్లే ఆ విధ్వంసం చోటు చేసుకుందని అభిప్రాయపడ్డారు. తుని అల్లర్లతో తనకు గాయాలైతే కనీసం పరామర్శించడానికి కూడా ముద్రగడ రాలేదని సీఐడీ అధికారుల వద్ద ముద్రగడ వాపోయినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే.. డ్రోన్ కెమెరాలకు స్పాన్సర్ గా వ్యవహరించిందెవరు? అనే విషయంపై ఆరా తీస్తున్నారు అధికారులు. డ్రోన్ కెమెరాలు అందించిన వారికి నోటీసులు జారీ చేసేందుకు సీఐడీ అధికారులు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇదంతా పక్కనబెడితే, విచారణకు హాజరైన సుధాకర్ నాయుడు గతంలో ఓ మామూలు పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేసి సస్పెండ్ అయ్యాడు. గుంటూర్ జిల్లా రేపల్లె ఆయన స్వస్థలం.
ఆ తర్వాత కాలంలో రాజకీయాలపై ఆసక్తితో ప్రజారాజ్యంలో చేరాడు. పీఆర్పీ నుంచి బయటకొచ్చాక ఇప్పుడో న్యూస్ చానెల్ ఏర్పాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలన్న వ్యూహంతోనే కాపు పెద్దలకు సుధాకర్ నాయుడు మద్దతు పలికారన్న వాదన కూడా ఉంది.