ఏపీలో మీ-సేవలు బంద్: గ్రామ సచివాలయాల ఎఫెక్ట్ : ప్రభుత్వం హామ ఇచ్చే వరకూ..!
ఏపీలో మీ-సేవ కేంద్రాల బంద్ కొనసాగుతోంది. గ్రామ సచివాలయాల్లో మీ-సేవ లను అందించేం దుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవటంతో.. జీవనోపాధి దెబ్బతింటుందని భావించిన ఆపరేటర్లు సమ్మెకు దిగుతున్నారు. నిరవధికంగా మీ-సేవ ఆపరేటర్లు సమ్మెకు దిగనున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వలంటీర్లకు మీ-సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో, మీ-సేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులకు నష్టం చేస్తుందని..ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ వచ్చే వరకూ సమ్మె కొనసాగుతుందని ఆపరేటర్లు స్పష్టం చేస్తున్నారు.
ఏపీ వ్యాప్తంగా మీ సేవ కేంద్రాల ద్వారా సేవలను నిలుపుదల చేసి నిరవధిక సమ్మెకు దిగాలని ఆపరేటర్లు నిర్ణయించారు. గ్రామ సచివాలయాల ప్రాజెక్టు పరిధిలోకి మీ-సేవలను తీసుకురావటం ద్వారా వీటిపైనే ఆధారపడి జీవిస్తున్న ఆపరేటర్లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. ధ్రువీకరణ పత్రాలు మొదలుకొని దరఖాస్తులను పూర్తిచేయటం, ఆన్లైన్ సేవలు, బిల్లుల చెల్లింపు వంటివన్నీ మీ-సేవ కేంద్రాల నుంచే జరుగుతున్నాయి.
తాజాగా కాపునేస్తం పథకానికి వేలాది సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. మీ-సేవ కేంద్రాల ద్వారా రోజుకు మూడు వేలకు పైగా ధ్రువీకరణ పత్రాల కోసమే దరఖాస్తులు వస్తున్నాయి. ఇవి కాకుండా మిగతా సేవలు సుమారు ఇంతకు రెట్టింపులో ఉంటాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులు, వలంటీర్లకు మీ-సేవల బాధ్యతలను కూడా అప్పజెప్పటంతో, మీ-సేవ కేంద్రాలపైనే ఆధారపడిన నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయం పైన ఆవేదన వ్యక్తం చేస్తన్నారు.
గతంలో ఇదే అంశం పైన ప్రభుత్వంలోని ముఖ్యుల వద్ద తమ ఆవేదన వ్యక్తం చేయగా..ఎటువంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని..అయితే, ఇప్పుడు అది అమలు దిశగా కనిపించక పోవటంతో..ఈ నిర్ణయం తీసుకున్నామని ఆపరేటర్లు చెబుతున్నారు. ఈ సమ్మె కారణంగా సాధారణ ప్రజలు ఇబ్బంది పడే అవకాశం కనిపిస్తోంది.