దమ్ముంటే నిరూపించు అంటూ యనమలకు మంత్రి బొత్సా సవాల్.. మండలిలో గందరగోళం .. వాయిదా
ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో పరిపాలన వికేంద్రీకరణ బిల్లును ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు శాసనమండలి లో బిల్లులపై చర్చ ప్రారంభించాలని ప్రభుత్వం కోరగా రూల్ 71 అనుమతించడంతో బిల్లులపై ఎలా చర్చపెడతారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు. దీంతో గందరగోళం నెలకొంది . సభ వాయిదా పడింది.
తీవ్ర మనస్తాపానికి గురవుతున్నా .. సారీ సభ నడపలేను : స్పీకర్ తమ్మినేని వాకౌట్
ఫోన్ చేసి ప్రలోభాలకు గురి చేశారన్న యనమల .. నిరూపించామన్న బొత్సా
ఇక ఈ సందర్భంలో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ మంత్రి బొత్సా సత్యన్నారాయణ . ఆయన తనపై చేసినవి అసత్య ఆరోపణలపై మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు . బిల్లుకు మద్దతివ్వాలని టీడీపీ ఎమ్మెల్సీలకు బొత్స ఫోన్ చేసి ప్రలోభాలకు గురిచేశారని మండలిలో యనమల ఆరోపించారు. అయితే యనమల తీరుపై మంత్రి అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా దమ్ముంటే ఏ ఎమ్మెల్సీకి ఫోన్ చేశామో నిరూపించాలని మంత్రి బొత్స సత్యనారాయణ సవాల్ విసిరారు.
టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభ నడపాలా అని ఆగ్రహం
ఈ సందర్భంగా బిల్లుకు సమయం కావాలని యనమల ఆడగడంపై మంత్రి బొత్స సత్యన్నారాయణ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గతంలో ఏం చేశారో గుర్తు తెచ్చుకోవాలని, బిల్లు పెట్టి గంటలో చర్చ చేపట్టిన సందర్భాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు అంతేకాకుండా టీడీపీకి ఇష్టం వచ్చినట్లు సభ నడపాలా అని ఆయన ప్రశ్నించారు. .మండలి చైర్మన్ షరీఫ్ తీరుపై కూడా మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైర్మన్గా తనకున్న విచక్షణాధికారాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించొద్దని బొత్స సూచించారు.
మండలి చైర్మన్ పై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన బొత్సా
ఇది మండలి ఛైర్మన్ పని తీరుకు మచ్చగా మిగిలిపోతుందని బొత్సా విమర్శించారు. మండలి చైర్మన్ పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై స్పందించిన మండలి చైర్మన్ షరీఫ్ తనకు రాజకీయాలను ఆపాదించవద్దని , నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఐదే సమయంలో రూల్ 71పై చైర్మన్ షరీఫ్ రూలింగ్ను పునఃసమీక్షించాలని మంత్రులు పట్టు పట్టారు.
మంత్రుల వ్యాఖ్యలపై గందరగోళం.. మండలి వాయిదా
ఈ విధంగా వ్యవహరిస్తే ప్రభుత్వం నడవదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు . దీంతో మంత్రుల వ్యాఖ్యలపై స్పందించిన ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంత్రుల తీరుతో సిగ్గు పడాల్సి వస్తోందన్నారు. ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదన్నారు. మంత్రుల తీరు షేమ్ షేమ్ అంటూ టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. సభలో గందరగోళం నెలకొనడంతో శాసనమండలి వాయిదా పడింది.