పులివెందుల టచ్ చేస్తారా - దమ్ముంటే నిరూపించాలి : జోగి రమేష్..!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి జోగి రమేష్ ఫైర్ అయ్యారు. పార్టీ నేతలు..కార్యకర్తలను చంద్రబాబు రెచ్చిగొడుతున్నారని మండిపడ్డారు. కుప్పంలో చంద్రబాబు పైన తిరుగుబాటు మొదలైందన్నారు. ప్రజా వ్యతిరేకతతో చంద్రబాబు కుప్పం నుంచి పోరిపోయారని దుయ్యబట్టారు. సెప్టెంబర్ ఒకటో తేదీ అంటే అంతర్జాతీయ వెన్నుపోటు దినోత్సవంగా అందరూ గుర్తు పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రెండు లక్షల కోట్ల అవినీతి పాల్పడ్డారంటూ చంద్రబాబు ఆరోపిస్తున్నారని..దమ్ముంటే చర్చకు రావాలని సవాల్ చేసారు.
డైరెక్ట్ బెనిఫిట్ట్రాన్స్ఫర్ ద్వారా ప్రజలకు అందించే సాయం వచ్చే డిసెంబర్ నాటికి రూ.2 లక్షల కోట్లకు చేరుతుందని వివరించారు. సీఎం బటన్ నొక్కగానే నేరుగా అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ముల అకౌంట్లోకి డబ్బులు వెళ్తున్నాయని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా కలలోనైనా చేశారా అంటూ నిలదీసారు. ఇప్పటికే రూ.1.75 లక్షల కోట్లు ప్రజలకు చేరువయ్యాయని చెప్పారు. అవినీతి మీద కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్నారని ధ్వజమెత్తారు.
స్టేలు విత్ డ్రా చేసుకునే దమ్ము చంద్రబాబుకు ఉందా అని మంత్రి ప్రశ్నించారు. ఎన్ని జాకీలు పెట్టి లేపినా చంద్రబాబు, ఆయన కుమారుడు ఇక లేవలేరని పేర్కొన్నారు. లేదు. సొంత పార్టీ నేతలే చంద్రబాబుని నమ్మటం లేదన్నారు.
దీని కారణంగానే గొడవలు చేయమని కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. పరిశ్రమలు రాకుండా అడ్డుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. పులివెందులని టచ్ చేసే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ సవాల్ చేసారు. కుప్పంలోనే కుదేలైన ఆయన ఇక పులివెందులలో ఏం చేస్తారంటూ మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. ప్రజల దృష్టి మరల్చేందుకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం అంటూ చంద్రబాబు డ్రామా మొదలు పెట్టారని విమర్శించారు. వైఎస్సార్ పేరు చెబితే ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, 108, 104, పేదలకు ఇళ్లు వంటి పథకాలు గుర్తుకొస్తాయి. చంద్రబాబు 14 సంవత్సరాల పాలనలో ఒక్క పథకం కూడా చెప్పుకోవడానికి లేదని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు.