లోకేష్ కు మంత్రి కారుమూరి సవాల్ - దమ్మంటే తెలంగాణలో చేయండి..!!
వైసీపీ - టీడీపీ నేతల మధ్య సవాళ్లు - ప్రతి సవాళ్లు పెరిగిపోతున్నాయి. టీడీపీ నేత నారా లోకేష్ తాజాగా పల్నాడులో చేసిన వ్యాఖ్యల పైన ఏపీ మంత్రులు స్పందిస్తున్నారు. ఛాలెంజ్ చేస్తున్నారు. పల్నాడు పర్యటనలో లోకేష్ భయం తమ బయోడేటాలో లేదు అంటూ వ్యాఖ్యానించారు. ట్విట్టర్.. మీడియా సమావేశాల్లోనే సీఎం జగన్ తో సహా వైసీపీ నేతలకు పలు అంశాల పైన సవాల్ చేస్తున్నారు. పల్నాడులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెళ్లి పైన లోకేష్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత పిన్నెళ్లి ఎక్కడ ఉన్న విడిచిపెట్టమంటూ హెచ్చరించారు. దీనికి పిన్నెళ్లి సైతం కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణలో చేయాలంటూ సవాల్
అసలు లోకేష్ కు బయోడేటా ఉందా అంటూ ప్రశ్నించారు. తాజాగా, మంత్రి కారుమూరి నాగేశ్వర రావు లోకేష్ కు సవాల్ చేసారు. దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో టీడీపీ ఆధ్వర్యంలో బాదుడే బాదుడు నిర్వహించి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తన సత్తాను చాటుకోవాలంటూ ఛాలెంజ్ చేసారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో సీఎం జగన్ దెబ్బకు చంద్రబాబుకు భయం పట్టుకుందని వ్యాఖ్యానించారు. దీంతో ..వాళ్లకు అక్కడ సొంతిల్లు కట్టుకొని..పర్యటనలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎంతగా ప్రయత్నాలు చేసినా.. రానున్న ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని.. వైసీపీ జెండా ఎగురవేస్తామంటూ కారుమూరి ధీమా వ్యక్తం చేసారు.

రూటు మార్చిన చంద్రబాబు - లోకేష్
టీడీపీ అధినేత చంద్రబాబు .. లోకేష్ వైసీపీని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. వైసీపీ నేతల వ్యాఖ్యలకు అదే స్థాయిలో సమాధానం చెబుతున్నారు. చంద్రబాబు సైతం జిల్లా పర్యటనల్లో భాగంగా సభల్లో మాట్లాడుతూ వైసీపీకి సవాళ్లు విసురుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విరుచుకుపడుతున్నారు. లోకేష్ పూర్తిగా తన ప్రసంగాల తీరును మార్చేసారు. సీఎం జగన్ కు పలు అంశాల పైన లేఖలు రాయటం.. ట్వీట్ల ద్వారా విమర్శలు చేయటం.. నేరుగా ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆరోపణలు చేయటం కంటిన్యూ చేస్తున్నారు.

కౌంటర్ ఎటాక్ లో వైసీపీ మంత్రులు
ఇక, మంత్రులు సైతం ప్రత్యేకించి లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు. లోకేష్ చేసే విమర్శలను తిప్పి కొడుతున్నారు. కొద్ది రోజులుగా అయ్యన్న పాత్రుడు వర్సెస్ వైసీపీ నేత విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వార్ పీక్ కు చేరింది. కేడర్ లో జోష్ నింపేందుకు రెండు పార్టీల నేతలు ఈ రకంగా సవాళ్లతో ప్రత్యర్ది పార్టీలను టార్గెట్ చేస్తున్నారు. ఇక, అటు టీడీపీ..ఇటు వైసీపీ మొత్తం రానున్న ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తుండటంతో..ఈ సవాళ్ల జోరు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications