పవన్ కల్యాణ్కు మంత్రి రోజా సవాల్..!!
అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్.. వలంటీర్లపై చేసిన ఆరోపణల దుమారం తగ్గట్లేదు. రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్లు రెండోరోజూ రోడ్డెక్కారు. పవన్ కల్యాణ్ దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. ఆయన ఫొటోలు, ఫ్లెక్సీలను తగులబెట్టారు. బహిరంగంగా క్షమాపణలు చెప్పేంత వరకూ వెనక్కి తగ్గబోమంటూ హెచ్చరించారు.
మానవ అక్రమ రవాణాకు వలంటీర్లు పాల్పడుతున్నారంటూ పవన్ కల్యాణ్ విమర్శించిన విషయం తెలిసిందే. మలిదశ వారాహి యాత్ర సందర్భంగా ఏలూరు నిర్వహించిన బహిరంగ సభలో ఆయన వలంటీర్లను తప్పుపట్టారు. రాష్ట్రంలో 17 వేల మంది మహిళలు కనిపించకుండా పోయారని, వారు అదృశ్యం కావడానికి వలంటీర్లే కారణమంటూ ఆరోపించారు.

ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పలువురు మంత్రులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎదురుదాడికి దిగారు. తాజాగా పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజా స్పందించారు. పవన్ కల్యాణ్పై ఘాటు విమర్శలు సంధించారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉండే వలంటీర్ల వ్యవస్థపై హ్యూమన్ ట్రాఫికింగ్ ఆరోపణలు చేయడం పవన్ కల్యాణ్ దిగజారుడు తనానికి నిదర్శనమని అన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏకవచనంతో పిలుస్తానంటూ పవన్ చెప్పడాన్ని రోజా తప్పుపట్టారు. నీకే ప్రజల్లో గౌరవం లేదు.. నువ్విచ్చే గౌరవం మాకు అవసరం లేదు.. అంటూ మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్ను గుండెల్లో పెట్టుకున్నారని, పవన్ లాంటి వ్యక్తి ఇచ్చే గౌరవం తమకు అవసరం లేదని చెప్పారు.
36 సంవత్సరాల వయస్సులో జగన్ మొదటిసారిగా ఎంపీ అయ్యారని, 55 ఏళ్లు వచ్చినా పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే కాదు కదా కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయాడంటూ రోజా ఎద్దేవా చేశారు. సరిగ్గా పదేళ్లుతిరిగే సరికి 151 మంది శాసన సభ్యుల బలంతో ముఖ్యమంత్రి అయ్యారని ఆమె గుర్తు చేశారు.
దమ్ము ఉంటే జగన్ను సింగులర్తో పిలవడం కాదని.. సింగిల్గా పోటీకి రావాలంటూ రోజా సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో జనసేన పార్టీ తరఫున అభ్యర్థులను పెట్టి, గెలిచి దమ్ము ఏంటో నిరూపించుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్కు వయస్సు పెరిగిందే తప్ప బుద్ధి పెరగలేదంటూ రోజా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications