నాన్ లోకల్ పొలిటీషియన్స్; షర్మిల నాలుగో కృష్ణుడు: మంత్రి రోజా నిప్పులు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను మరింత హీటెక్కిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జిల్లాల వారీగా కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించడంతోపాటు భారీ బహిరంగ సభలను ఏర్పాటు చేస్తూ ప్రజాక్షేత్రంలోకి వెళుతున్నారు. దూకుడుగా ప్రతిపక్షాలపై విమర్శలు కొనసాగిస్తున్నారు.
ఇక జగన్ బాటలోనే వైసీపీ మంత్రులు సైతం ప్రతిపక్ష పార్టీల నాయకుల పై నిప్పులు జరుగుతున్నారు. ఏపీలో జగన్ ను ఎదుర్కొనే దమ్ము లేక పొత్తులతో వస్తున్నారని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా మంత్రి రోజా విపక్ష పార్టీ నేతల పైన నాన్ లోకల్ పొలిటీషియన్స్ అంటూ నిప్పులు చెరిగారు.

వచ్చే ఎన్నికలలో నాన్ లోకల్ పొలిటీషియన్స్ ని ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, వారందరినీ ప్యాక్ చేసి హైదరాబాద్ కు పార్సిల్ చేస్తారని మంత్రి రోజా పేర్కొన్నారు. చంద్రబాబు ఎంతసేపు జగన్ పైన, ఆయన వెనుకున్న మావంటి సైనికుల పైన దుమ్మెత్తి పోయడం తప్ప ఏమీ చేయలేడని రోజా ఆరోపించారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సభలకు వస్తున్న జనాన్ని చూస్తే మరోసారి రాష్ట్ర ప్రజలు అంతా జగన్ వైపే ఉన్నారని, ఆయనను సీఎం చేయడానికి జనం చూస్తున్నారని అర్థమవుతుందన్నారు రోజా. ప్రజలకు ఏం చేశాను.. ఏం చేస్తాను అనేవి చెప్పలేని చంద్రబాబు నిరాశా నిస్పృహలతో మాట్లాడుతున్నాడని రోజా విమర్శించారు.
ఇక ఆయన కుమారుడు లోకేష్ చేతకాని వాడని, దత్త పుత్రుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని రోజా విమర్శించారు. ఇప్పుడు నాలుగో కృష్ణుడిలా కొత్తగా షర్మిలను రంగంలోకి దింపారని రోజా ఆరోపించారు. షర్మిల ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసిన, రాజశేఖర్ రెడ్డి ని అవమానించిన కాంగ్రెస్ పార్టీలో చేరడం తగదని రోజా పేర్కొన్నారు . కేవలం స్వప్రయోజనాల కోసం వీళ్లంతా జగన్ పైన విషం చిమ్ముతున్నారని మంత్రి రోజా మండిపడ్డారు.












Click it and Unblock the Notifications