‘అఖిలప్రియా! ముందు మీరు తెలుగులో మాట్లాడండి’
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం తెలుగు భాషపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడారు. చర్చ సందర్భంగా ఇకపై అన్ని శాఖలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అన్నారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలలో బుధవారం తెలుగు భాషపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మంత్రి అఖిలప్రియ మాట్లాడారు. చర్చ సందర్భంగా ఇకపై అన్ని శాఖలు తెలుగు భాషకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆమె అన్నారు.
అయితే, ఈ సందర్భంగా ఆమె కొన్ని ఆంగ్ల పదాలను ఉపయోగించారు. దీనిపై శాసనసభ్యుడు గౌతు శ్యాం సుందర్ శివాజీ స్పందించారు. మంత్రి అఖిలప్రియ.. తెలుగులో మాట్లాడాలని చెబుతూనే, ఆంగ్లంలో మాట్లాడుతున్నారని తప్పుబట్టారు.
ముందు మంత్రులు అసెంబ్లీలో కూడా ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగులో మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్యే శ్యాం సుందర్ శివాజీ సూచించారు. కాగా, ఈ రోజు సమావేశాల్లో ప్రధానంగా విద్యార్థుల ఆత్మహత్యలపై చర్చించారు.
స్కూల్, కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి పెంచడం వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నాయని, ఈ విషయంలో సదరు యాజమాన్యాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
తెలుగుకు పూర్వ వైభవం
తెలుగుభాషకు పూర్వవైభవం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. తెలుగు భాషపై తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్కుమార్ శాసనసభలో ప్రవేశపెట్టిన సావధాన తీర్మానంపై ఆయన మాట్లాడారు. తెలుగు భాషను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత అందరిపై ఉందన్నారు. న్యాయ పాలనలో తెలుగు అమలు సత్వర చర్యలు తీసుకోవాలన్నారు.