షాక్: అనుచరులతో ఎమ్మెల్యే బుడ్డా మంతనాలు, శిల్పాకు దెబ్బేనా?
Recommended Video
కర్నూల్: నంద్యాల ఉపఎన్నికల ప్రభావం కర్నూల్ జిల్లాలోని పలు నియోజకవర్గాలపై పడుతోంది. నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల సందర్భంగా టిడిపిని వీడి వైసీపీలో చేరిన శిల్పా సోదరులకు రాజకీయంగా చెక్ పెట్టేందుకు టిడిపి ప్రయత్నాలు చేస్తోంది. శ్రీశైలం నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులను కలుపుకొని వెళ్ళేందుకు ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి సన్నాహలు చేస్తున్నారు. శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులు బుడ్డా వెంట నడిస్తే రాజకీయంగా శిల్పాకు ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నంద్యాల అసెంబ్లీ ఉపఎన్నికల సమయంలో శిల్పా మోహన్రెడ్డి, ఆయన సోదరుడు శిల్పా చక్రపాణిరెడ్డిలు టిడిపిని వీడి వైసీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో శ్రీశైలం అసెంబ్లీ టిక్కెట్టు విషయమై స్పష్టత ఇస్తే టిడిపిని వీడబోనని శిల్పా చక్రపాణిరెడ్డి చెప్పారు. అయితే ఈ విషయమై టిడిపి నుండి స్పష్టత రాలేదు.దీంతో ఆయన టిడిపిని వీడి వైసీపీలో చేరారు.
వైసీపీలో చేరే ముందు వైసీపీ చీఫ్ జగన్ సూచన మేరకు ఎమ్మెల్సీ పదవికి కూడ శిల్పా చక్రపాణిరెడ్డి రాజీనామా సమర్పించారు. ఎమ్మెల్సీ రాజీనామా కూడ ఆమోదం పొందింది. అయితే రాజకీయంగా శిల్పా సోదరులకు చెక్ పెట్టేందుకు టిడిపి ప్రయత్నాలను ప్రారంభించింది.
శిల్పా చక్రపాణిరెడ్డికి చెక్ పెట్టే వ్యూహం
కర్నూల్ జిల్లా శ్రీశైలం అసెంబ్లీ నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి వర్గీయులను తనతో కలుపుకుపోవాలని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్రెడ్డి ప్రయత్నాలను ప్రారంభించారు. ఈ నియోజకవర్గంలో శిల్పా చక్రపాణిరెడ్డి, బుడ్డా రాజశేఖర్రెడ్డి వర్గీయులు మధ్య ప్రచ్ఛన్నయుద్దం ఇప్పటివరకు కొనసాగింది. పార్టీ కార్యక్రమాలైనా, ప్రభుత్వ కార్యక్రమాలైనా ఈ రెండు గ్రూపులు వేర్వేరుగా పాల్గొనేవి. శిల్పా చక్రపాణిరెడ్డి వైసీపీలో చేరడంతో ఆయన వర్గీయులను టిడిపిలోనే కొనసాగేలా బుడ్డా రాజశేఖర్రెడ్డి చక్రం తిప్పుతున్నారు.
నియోజకవర్గానికి చెందిన శిల్పా వర్గీయులతో బుడ్డా సమావేశం
శిల్పా వైసీపీ తీర్థం పుచ్చుకోవడంతో ఆత్మకూరులో రాజకీయ మార్పులు ఊపందుకున్నాయి. పార్టీ అధికారంలో ఉన్నందున శిల్పా వర్గానికి చెందిన నేతలు చాలామంది టీడీపీని వదిలేందుకు ఇష్టపడటం లేదు. ఆత్మకూరు మున్సిపాలిటీతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన శిల్పా వర్గీయులతో సోమవారం సమావేశం అవుతున్నారు.పార్టీలో ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వారికి ఇస్తానని.. ఇప్పటికే ఆయా గ్రామాల నాయకులకు ఎమ్మెల్యే బుడ్డా సూచించినట్లు సమాచారం.
శిల్పా వర్గం వస్తే ఇబ్బందులేనా?
టీడీపీకి చెందిన బలమైన క్యాడర్ అంతా శిల్పా వెంటే ఉండేవారు. ముఖ్యమైన పదవులను అనుభవించిన వారు, సీనియర్లు అందరూ శిల్పా వర్గీయులే.వీరంతా బుడ్డా పక్షాన చేరితే తమ పరిస్థితి ఏమిటని బుడ్డా వర్గం ద్వితీయ శ్రేణి నాయకులు ఆందోళ నకు గురవుతున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే బుడ్డా గతంలో టీడీపీలో ఉండి వైసీపీలో చేరారు. తిరిగీ టీడీపీలోకి వచ్చారు. ఈ కారణంగా బుడ్డాతో టీడీపీలోని శిల్పా వర్గీయులకూ సాన్నిహిత్యం ఉంది. ఈ కారణంగా ఎమ్మెల్యే వద్దకు వెళ్లేందుకు ఏమాత్రం సంకోచించడం లేదని శిల్పా వర్గానికి చెందిన సీనియర్ నాయకులు అంటున్నట్లు సమాచారం.
శిల్పాకు చెక్ పెట్టేనా?
ఆది నుంచి మాజీ ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి వెంట నడిచి.. అనేక పనులను చేయించుకుని ప్రస్తుతం ఆయనను వదిలి ఎమ్మెల్యే బుడ్డా వర్గంతో జతకట్టేందుకు కొందరు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే కొందరు నేతలు మాజీ ఎమ్మెల్సీ శిల్పాతో చర్చలు జరిపినట్లు తెలిసింది. అయితే శిల్పాను వదిలి బుడ్డా రాజశేఖర్రెడ్డి వెంట నడిస్తే రాజకీయంగా శిల్పాకు ఇబ్బందులు తప్పేలా లేవని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే తన వర్గాన్ని కాపాడుకొనేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి కూడ ప్రయత్నిస్తున్నారు. బుడ్డా వైపుకు వెళ్ళకుండా తనతోపాటే వైసీపీలో తన అనుచరులను తీసుకెళ్ళేందుకు శిల్పా చక్రపాణిరెడ్డి వ్యూహరచన చేస్తున్నారు.