ఎమ్మెల్సీ ఎన్నికలు: కెసిఆర్ ఐదో అభ్యర్థి వ్యూహం ఏమిటి?
హైదరాబాద్: తెలంగాణ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటా కింద జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఐదో అభ్యర్థిని రంగంలోకి దించాలనే ఆలోచన వెనక వ్యూహం ఏమిటనేది చర్చనీయాంశంగా మారింది. శాసనసభ బలాబలాలను బట్టి టిఆర్ఎస్ నాలుగు స్థానాలు గెలుచుకోవడానికి అవకాశం ఉంది. అయితే, ఐదో అభ్యర్థిని కూడా రంగంలోకి దించాలని ఆయన యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో నాలుగు స్థానాలను టిఆర్ఎస్ గెలుచుకుంటుంది. మరో రెండు స్థానాల్లో ఒకటి కాంగ్రెసు, మరోటి బిజెపి - టిడిపి కూటమి గెలుచుకుంటాయనే అంచనా సాగుతోంది. అయితే, రాజకీయ వ్యూహరచనలో ఆ పార్టీలను దెబ్బ తీసే ఎత్తుగడను కెసిఆర్ ఎంచుకున్నారా అనేది తెలియడం లేదు. కాంగ్రెసు శాసనసభా పక్ష నేత కె. జానా రెడ్డి బుధవారం ఉదయం టిఆర్ఎస్ సీనియర్ నేత కె. కేశవరావును కలవడం వెనక ఉన్న ఆంతర్యం కెసిఆర్ వ్యూహరచన విషయమే కావచ్చుననే మాట కూడా వినిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క ఎమ్మెల్సీ సీటును బిజెపికి ఇచ్చిన తెలుగుదేశం పార్టీ తెలంగాణ సీటుకు తానే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారంనాడు ఢిల్లీలో ప్రకటించారు కూడా. అయితే, టిడిపి పోటీ చేస్తే ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉందా అనే కోణంలో మీడియా వార్తాకథనాలు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నాయి.

పట్టభద్రుల కోటాలో జరిగిన తెలంగాణ జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి బిజెపి అభ్యర్థికి మద్దతు ఇచ్చింది. దాంతో బిజెపి హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ సీటును గెలుచుకుంది. అందువల్ల ఎమ్మెల్యే కోటాలో ప్రస్తుతం జరిగే ఎన్నికల్లో బిజెపి టిడిపికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుంది. అయితే, టిడిపిని దెబ్బ తీయడానికే కెసిఆర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఐదో అభ్యర్థిని పోటీకి దించుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇదే వాదనను బిజెపిలోని ఓ వర్గం చేస్తోంది.
టిడిపి పోటీ చేయకుండా బిజెపి పోటీ చేస్తే టిఆర్ఎస్ ఐదో అభ్యర్థిని పోటీకి దించకపోవచ్చునని వాదిస్తున్నారు. స్వచ్ఛ హైదరాబాద్ ద్వారా, తదితర కార్యక్రమాల ద్వారా బిజెపికి దగ్గర కావాలని చూస్తున్న కెసిఆర్ బిజెపి అభ్యర్థిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి దించితే ఐదో అభ్యర్థిని పెట్టే ఆలోచనను విరమించుకోవచ్చునని అంటున్నారు. అయితే, ప్రతిపక్షాలను బలహీనరిచే రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగుతున్న కెసిఆర్ ఐదో అభ్యర్థిని దించాలని అనుకుంటున్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications