వెంకయ్య తప్పులేదు, ఓపికపట్టాలి: హోదాపై ఫ్యాన్స్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తప్పు ఏమీ లేదని ప్రధాని నరేంద్ర మోడీ అభిమాన సంఘం మంగళవారం చెప్పింది. మోడీ అభిమాన సంఘం అధ్యక్షులు రామదాసప్ప నాయుడు మాట్లాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కొత్త ఏపీకి జరుగుతున్న నష్టంపై వెంకయ్యనాయుడు నాడు రాజ్యసభలో అప్పటి యూపీఏ ప్రభుత్వాన్ని నిలదీశారని గుర్తు చేశారు. వెంకయ్య కారణంగానే ఏపీకి మేలు జరిగేలా కొన్ని హామీలు వచ్చాయన్నారు.
ప్రత్యేక హోదాను అమలు చేయడంలో కాంగ్రెస్ అప్పుడు విఫలమైందని ఆరోపించారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభలో ఎన్డీయేకు మెజార్టీ లేదని గుర్తు చేశారు. అందుకే ఈ అంశం పెండింగులో ఉంటోందని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదాకు మించి నిధులు లభించాయన్నారు.
ప్రత్యేక హోదా సరైన సమయంలో ఇస్తారని చెప్పారు. అది కూడా వెంకయ్య నాయుడు ద్వారానే సాధ్యమవుతుందని, అప్పటి వరకు ఓపిక పట్టాలన్నారు. కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటులో, బయటా విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు.