మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అప్పు అరెస్టు: రామన్ హత్య కేసులో నిందితుడు
తిరుపతి: మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ అప్పు అలియాస్ అన్బు సెల్వంను పోలీసులు మంగళవారంనాడు అరెస్టు చేశారు. చిత్తూరులో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతన్ని పోలీసు స్టేషన్కు తరలించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా అతను పలు కీలకమైన విషయాలు వెల్లడించినట్లు చెబుతున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణాలో అప్పు అత్యంత కీలకంగా వ్యవహరించాడని పోలీసులు తెలిపారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో తనకు సహకరించిన పలువురి పేర్లను అతను వెల్లడించినట్లు చెబుతున్నారు. అప్పును పోలీసులు బుధవారం శ్రీకాళహస్తి కోర్టులో ప్రవేశపెడుతున్నారు.
అప్పుకు బెయిల్ రాబట్టేందుకు చెన్నై న్యాయవాదులు కొంత మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు వినికిడి. గతంలో కంచి శంకరమఠం మేనేజర్ రామన్ హత్య కేసులో అప్పు ప్రధాన నిందితుడని పోలీసులు తెలిపారు. చెన్నైలోని అప్పుకు ఓ హోటల్ కూడా ఉందని వారు చెప్పారు. అప్పు కోసం పోలీసులు గత కొంత కాలంగా తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతను మంగళవారంనాడు పోలీసులకు చిక్కాడు.
కాగా, ఎర్రచందనం నరికివేతకు కూలీలను తమిళనాడు నుంచి రవాణా చేస్తున్న తీరును పోలీసులు కనిపెట్టినట్లు సమాచారం. కూలీలను బస్సుల ద్వారా తరలిస్తున్నట్లు వారు గుర్తించారు. బస్సులను వారి కోసమే ఖాళీగా ఉంచి, వారిని తరలిస్తున్నట్లు తెలుసుకున్నారు.