Rain Alert: తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్: ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు!
Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఇప్పటికే గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండగా.. వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
తెలంగాణకు వర్షసూచన
తెలంగాణలోని హైదరబాద్ తో పాటు మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. సంగారెడ్డి జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ కాగా.. ఉరుములు-మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. వికారాబాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాయంత్రం వరకు వర్షాలు నమోదవుతాయి. ఆ సమయంలో 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏపీలో వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో కూడా పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర, దాని పరిసర జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయబడింది. ముఖ్యంగా ఎస్.కోట, భీమునిపట్నం, కొత్తవలస, భోగాపురం, ఆనందపురం, సబ్బవరం, అనకాపల్లి ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లోని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
వర్షాలు, ఉరుముల సమయం ప్రజలు బయట తిరగొద్దని, చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడటం ప్రమాదకరమని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు పిడుగుల బారిన పడకుండా సురక్షితమైన ప్రదేశాలకు వెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications