ఏపీలో విద్యార్థులకు మరో శుభవార్త.. మీకోసం ప్రత్యేక సిక్ రూమ్లు.. ఫ్రీ వైద్యసేవలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడానికి నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ఇదే సమయంలో విద్యార్థుల ఆరోగ్య రక్షణకు కూడా అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వ పాఠశాలలలో ప్రత్యేక సిక్ రూంలను ఏర్పాటు చేయడానికి నిధులను కేటాయించింది. పాఠశాల విద్యాశాఖ ద్వారా మంజూరైన ఈ నిధులను, విద్యార్థుల విద్య అవసరాలకు ఉపయోగిస్తారు.
ఏపీ స్కూల్స్ లో సిక్ రూమ్ లు
ఇందులో భాగంగా ఎవరైనా విద్యార్థులు అనారోగ్యంతో ఉంటే వారికి ఆ సిక్ రూమ్ లో రెస్ట్ తీసుకునే అవకాశం కల్పిస్తారు. ప్రాథమిక, ఉన్నత పాఠశాలలలో ఒక ప్రత్యేక గదిని కేటాయించి అందులో ప్రథమ చికిత్స మందులు, బెడ్లు, విసనకర్రలు లేదా ఫ్యాన్లు, అవసరమైన వైద్య సామగ్రిని అందుబాటులో ఉంచుతారు.

విద్యార్థి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైతే స్కూల్స్ లోనే సిక్ రూమ్ లు
ఎవరైనా విద్యార్థులకు తరగతి గదిలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా కడుపునొప్పి, తలనొప్పి, జ్వరం వంటివి రావడం లేదా ఆడుకునే సమయంలో గాయపడడం వంటి సందర్భాలలో వారు వెంటనే విశ్రాంతి తీసుకునే విధంగా ఈ సిక్ రూమ్ లు ఉపయోగపడతాయి. గతంలో ఇలాంటి వసతులు లేకపోవటం కారణంగా పిల్లలు ఇబ్బంది పడేవారు.
ప్రతీ స్కూల్ కు ప్రత్యేకంగా నిధులు
ఇక ఈ సిక్ రూముల నిర్వహణ, అత్యవసర సమయాలలో ప్రాథమిక చికిత్స అందించేందుకు, ఉపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులకు ప్రత్యేక అవగాహనను కల్పిస్తారు. ఇదే సమయంలో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలతో పాఠశాలలను అనుసంధానం చేయనున్నారు. ప్రతి పాఠశాలకు ప్రత్యేకంగా వీటికోసం నిధులను కేటాయిస్తారు.
ప్రభుత్వ నిర్ణయంతో పేరెంట్స్ కు సంతోషం
స్థానిక పాఠశాల నిర్వహణ కమిటీలు ఈ నిధులతో బెడ్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు సమకూరుస్తారు. ఈ వసతులు అందుబాటులోకి రావడం విద్యార్థుల ఆరోగ్య రక్షణకు దోహదం చేస్తుంది. దీంతో విద్యార్థులను అనారోగ్యంగా ఉన్నప్పటికీ, స్కూల్లో వైద్య సేవలు అందుబాటులో ఉండడంతో పేరెంట్స్ స్కూల్స్ కు పంపిస్తారు. ఫలితంగా విద్యార్థుల హాజరు శాతం పెరుగుతుంది. ఇక ఈ నిర్ణయం పైన ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది పాఠశాలలోని మౌలిక వసతుల అభివృద్ధికి కీలకమైన అడుగుగా భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications