ఏపీకి మరో వందేభారత్ - రూట్, షెడ్యూల్..!!
ఏపీకి మరో వందేభారత్ సర్వీసు అందుబాటులోకి రానుంది. ఏపీలో ప్రస్తుతం కొనసాగుతున్న వందేభారత్ రైళ్లకు ఆశించిన స్థాయిలో ఆదరణ కనిపిస్తోంది. దీంతో, ప్రయాణీకుల నుంచి వస్తున్న డిమాండ్ల మేరకు మరో వందేభారత్ కేటాయించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి వందేభారత్ నడుస్తోంది. అయితే, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ కేటాయించాలనే తాజా ప్రతిపాదనకు దాదాపుగా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. షెడ్యూల్, రూట్ పైన కసరత్తు జరుగుతోంది.
వందేభారత్ కొత్తగా
తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు డిమాండ్ పెరుగుతోంది. సికింద్రాబాద్ నుంచి విశాఖ, అదే విధంగా సికింద్రాబాద్ టు తిరుపతి, విజయవాడ టు చెన్నై, కాచిగూడ నుంచి యశ్వంత్ పూర్, సికింద్రాబాద్ టు నాగపూర్, విశాఖ నుంచి దుర్గ్, విశాఖ టు భువనేశ్వర్ మధ్య వందేభారత్ సర్వీసు లు నడుస్తున్నాయి. ఇక, ఇప్పుడు విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ రైలు కేటాయింపు పైన రైల్వే మంత్రికి ప్రతిపాదనలు అందాయి. విశాఖ ఎంపీ భరత్ తాజాగా ఈ మేరకు ప్రత్యేకంగా రైల్వే మంత్రిని అభ్యర్ధించారు. అందుకు సానుకూల స్పందన వ్యక్తం అయింది. ప్రస్తుతం విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే రైళ్లు నిత్యం రద్దీగా ఉంటున్నాయి. దీంతో, విశాఖ నుంచి తిరుపతికి వెళ్లే తిరుమల భక్తుల సౌకర్యార్ధం వందేభారత్ ప్రతిపాదన పైన ప్రస్తుతం రైల్వే శాఖ ఫోకస్ చేసింది.

విశాఖ టు తిరుపతి
కొద్ది రోజుల క్రితం ప్రారంభించిన విశాఖ నుంచి దుర్గ్ వందేభారత్ కు ఆశించిన స్థాయిలో ఆదరణ లేదని రైల్వే అధికారులు గుర్తించారు. ఈ రైలుకు మరిన్ని బోగీలు కేటాయించి విశాఖ - తిరుపతి మధ్య కొనసాగించే ప్రతిపాదన పైన చర్చ జరుగుతోంది. అయితే, ఈ నిర్ణయం అమల్లో వచ్చే సమస్యల పైన అధికారులు అధ్యయనం చేస్తున్నారు. కాగా, విశాఖ నుంచి తిరుపతికి వందేభారత్ స్లీపర్ కేటాయించాలనేది రైల్వే అధికారుల మరో ప్రతిపాదన పైన కసరత్తు చేస్తున్నారు. దీని కారణంగా దూర ప్రయాణం కావటంతో ప్రయాణీకులకు మరింత సౌకర్య వంతంగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి గుంటూరు మీదుగా తిరుపతికి వందేభారత్ రైలు నడుస్తోంది. దీంతో, వందేభారత్ స్లీపర్ ప్రవేశ పెట్టటం ద్వారా ప్రయాణీకులకు మరింతగా ప్రయోజన కరంగా ఉంటుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు.
ప్రతిపాదనల పై కసరత్తు
ఈ రకమైన ప్రతిపాదనలు వస్తుండటంతో.. పూర్తిగా రూట్.. షెడ్యూల్ పైన కసరత్తు చేసి నివేదిక ఇవ్వాలని రైల్వే శాఖ సూచించినట్లు సమాచారం. వందేభారత్ స్లీపర్ వైపే స్థానిక రైల్వే డివిజన్ అధికారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు నిత్యం ఆలస్యంగా నడుస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. విశాఖ నుంచి విజయవాడ వరకు రైలు మార్గం లో పలు రైళ్ల రాకపోకలతో రద్దీగా ఉంటోంది. దీంతో, కొత్తగా ప్రవేశ పెట్టే విశాఖ - తిరుపతి వందేభారత్ కు సమస్య లేకుండా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. ఈ ప్రతిపాదనల పైన కసరత్తు పూర్తయిన తరువాత విశాఖ - తిరుపతి వందేభారత్ పైన రైల్వే శాఖ అధికారిక ప్రకటన చేసేందుకు సిద్దం అవుతోంది.












Click it and Unblock the Notifications