మోడీ ఎదుట ఎంపీ శివప్రసాద్ ఆసక్తికరం, అయిపోయింది.. జేసీ సంచలనం
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ శుక్రవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ ఎదుట ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీ ప్రజలంతా ఇప్పుడు ఓం 'నమో''నారా'యణాయ మంత్రాన్ని జపిస్తున్నారని ప్రధాని మోడీ వద్ద వ్యాఖ్యానించారని తెలుస్తోంది.
నమో అంటే నరేంద్ర మోడీ అని, నారా అంటే నారా చంద్రబాబు నాయుడని ఆయన చెప్పారు. టిడిపి ఎంపీలు ప్రధాని మోడీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా మీ సమస్య నా సమస్య అని ఆయన వారికి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.
రాష్ట్ర సమస్యలను, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని ఎంపీలు ప్రధాని మోడీకి వివరించారు. కాగా, మోడీ, చంద్రబాబులు తమ రాష్ట్రాన్ని ఆదుకుంటారని ఏపీ ప్రజలంతా గంపెడాశతో ఉన్నారని, వారి ఆశలను నెరవేర్చాలని మోడీకి చెప్పామని ఎంపీ శివప్రసాద్ అన్నారు.
బీజేపీపై జేసీ సంచలనం
ఏపీకి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదని టిడిపి అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సాయంత్రం పరోక్షంగా అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందని వ్యాఖ్యానించారు.
మనం ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదన్నారు. కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండేలా కనిపిస్తోందన్నారు. ఏపీ సమస్యను మిగతా రాష్ట్రాల సమస్యలతో పోల్చి చూడవద్దని ప్రధానికి విరించినట్లు చెప్పారు. ఏపీ నష్టపోయిందని గుర్తు చేశామన్నారు.