మోదీ భార్యను బహిరంగంగానే నిందించింది ఎవరు?
Chandrababu Naidu: రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టుల వ్యవహారం.. దుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం- వైసీపీకి మధ్య మాటల యుద్ధానికి తెర తీసింది. విమర్శలు ప్రతివిమర్శలకు కారణమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వ్యతిరేక పోస్టులు పెడుతున్నారనే కారణంతో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తోన్న విషయం తెలిసిందే.

మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టే వారికి చంద్రబాబు హెచ్చరికలను జారీ చేశారు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటామని, ఆడబిడ్డల జోలికి వస్తే మాత్రం సహించబోమని అన్నారు. వ్యక్తిత్వం హననం చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పారు.
దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఆర్ కే రోజా ఇదివరకే స్పందించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్పై ఎదురుదాడికి దిగారు. వ్యక్తిత్వ హననం చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడంటూ ధ్వజమెత్తారు. గతంలో తనను చంద్రబాబు పోలీసులతో కిడ్నాప్ చేయించాడంటూ విమర్శించారు.
ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయిరెడ్డి గళం విప్పారు. గతంలో చంద్రబాబు మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. వాటికి సంబంధించిన కొంత సమాచారాన్ని తన అధికారిక ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
ప్రధాని మోదీ సతీమణి గారిని బహిరంగంగానే నిందించింది ఎవరు ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2024
ప్రధాని తల్లిగారిని ప్రస్తావించింది ఎవరు ?
బుల్ బుల్ హిందీలో ఇష్టారాజ్యంగా మాట్లాడింది ఎవరు ?
వైఎస్సార్ గారి కుమార్తెను వేధించేందుకు ఇంటి నుంచే వెబ్ సైట్లు నడిపిందెవరు ?
వీటికన్నా ముందే సొంత మామను నగ్నంగా…
సాక్షాత్తూ ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సతీమణిని బహిరంగంగానే నిందించింది ఎవరంటూ విజయసాయి రెడ్డి ప్రశ్నించారు. ప్రధాని తల్లిని సైతం ప్రస్తావనకు తీసుకొచ్చింది ఎవరు? అని నిలదీశారు. బుల్ బుల్ హిందీలో ఇష్టారాజ్యంగా మాట్లాడింది ఎవరని, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెను వేధించడానికి ఇంటి నుంచే వెబ్ సైట్లను నడిపిందెవరని ప్రశ్నల వర్షాన్ని కురిపించారు.
వీటన్నింటి కంటే ముందే పిల్లను ఇచ్చిన సొంత మామను నగ్నంగా చిత్రీకరించింది ఎవరని, అత్త మీద అవాకులు చవాకులు మాట్లాడింది ఎవరని విజయసాయి రెడ్డి అన్నారు. ఒకటా రెండా, ఆరంభం నుంచి వ్యక్తిత్వ హననం చేస్తూ ఇప్పుడు నీతులు వల్లించడం మీకే చెల్లిందని చెప్పారు. ఆవు పొలంలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అంటూ ముక్తాయింపు ఇచ్చారు.












Click it and Unblock the Notifications