ఆంధ్రాకి 7మండలాలు: నాయిని హెచ్చరిక, పదిజిల్లాల్లో..
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని తెలంగాణ రాష్ట్ర సమితి సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి బుధవారం హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడారు. ఇద్దరు నాయుళ్లు కలిసి తెలంగాణను మోసం చేస్తున్నారన్నారు. కెసిఆర్ పిలుపు మేరకు పది జిల్లాల్లోను బంద్ను విజయవంతం చేస్తామన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కుమ్మక్కై పోలవరం ముంపు మండలాలను ఆంధ్రలో కలుపుతున్నారని మండిపడ్డారు. ప్రజలే వారికి బుద్ధి చెబుతారని ఆయన అన్నారు.

కాగా, ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఆంధ్రాలో కలపడానికి కేంద్ర కేబినెట్ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఆ ఆర్డినెన్స్ను నిరసిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురువారం తెలంగాణ బందుకు పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టు కోసం ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను తమ రాష్ట్రంలో కలపాలని ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఏడు మండలాలను కలపవద్దని తెలంగాణ పార్టీలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే వాటిని ఆంధ్రాలో కలపాలని కేంద్రం కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆర్డినెన్స్ జారీ చేయనున్నారు. ఈ ఆర్డినెన్స్ పైన కెసిఆర్ మండిపడ్డారు. కేంద్రం జారీ చేసిన ఆర్డినెన్స్ సరికాదని ఆయన ఖండించారు. దీనిని నిరసిస్తూ రేపు బందుకు పిలుపునిచ్చారు. కేంద్రం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రలో కలిపితే ఊరుకునేది లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసిన ద్రోహాన్ని తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ బందుకు టిఎన్జీవో మద్దతు పలికింది.
ఆంధ్రా నేతల ఒత్తిడికి కేంద్ర ప్రభుత్వం తలొగ్గిందన్నారు. కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక నిర్ణయాన్ని నిరసిస్తూ రేపు బందుకు పిలుపునిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ వ్యాపార సంఘాలు బందుకు సహకరించాలని కోరారు. ముంపు ప్రాంతాల ఆర్డినెన్స్ ఆమోదించవద్దని తాను రాష్ట్రపతిని కోరానని చెప్పారు. ముంపు గ్రామాల్లో ఉద్యోగుల పరిస్థితి ఏమిటో కేంద్రం తేల్చాలని టిఎన్జీవో నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications