ప్రేమ పెళ్లి: అలా నమ్మించి ఆటోలో.. మార్గమధ్యలో అతనికి షాక్..
అనూష-హరికృష్ణ అనే యువ జంటను అనూష బంధువులు విడదీసినట్లు తెలుస్తోంది.
నెల్లూరు: ప్రేమించి పెళ్లి చేసుకున్న తన నుంచి భార్యను అన్యాయంగా లాక్కెళ్లారని హరికృష్ణ అనే యువకుడు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. భార్య మేనమామ బలవంతంగా ఆమెను లాక్కెళ్లాడని, తమను విడదీయాలని చూస్తున్నారని పేర్కొన్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరులోని వెంకటగిరి, వెల్లికల్లు ఎస్టీ కాలనీకి చెందిన కానూరు నరసింహులు, నాగమ్మ దంపతుల కుమార్తె అనూష. అదే కాలనీకి చెందిన హరికృష్ణ అనే యువకుడిని ఆమె ప్రేమించినట్లు తెలుస్తోంది.
ఇదే క్రమంలో ఈ నెల 1న తన ఇంటికి వచ్చిన అనూష.. తల్లిదండ్రులు తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారని, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిందని హరికృష్ణ తెలిపాడు. దీంతో విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లగా.. పెళ్లికి వారు అంగీకరించారు. ఆదివారం నాడు హరికృష్ణ బంధువుల ఇంటి వద్ద పెళ్లి చేసుకున్నారు.
సోమవారం ఉదయం వెంకటగిరి పట్టణానికి చెందిన అనూష మేనమామ అంకారావులు అక్కడికి వచ్చారు. అమ్మాయి తల్లిదండ్రుల సమక్షంలో ఇద్దరికి వివాహం జరిపిస్తామని, ఒకవేళ రాకపోతే ఇద్దరిని చంపేస్తామని బెదిరించారు. దీంతో వాళ్లతో పాటు ఆటోలో బయలుదేరామని, మార్గమధ్యలో తనను బలవంతంగా కిందకు తెచ్చి అనూషను తీసుకెళ్లిపోయారని వాపోయాడు. అనూషను వెంకటగిరి వైపు తీసుకోని వెళ్లినట్లు బాధితుడు వివరించాడు. పోలీసుల న్యాయం చేయాలని కోరాడు.